జేసీ వాక్ విన్యాసం..! దాని వెనక ఉందో పెద్ద రహస్యం..!!
అమరావతి/హైదరాబాద్ : మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మారిపోవడం జేసీ బ్రదర్స్ కి తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడతా. మనసుకు తోచించి మాట్లాడతా అంటూ, రెచ్చిపోయి మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడేమయింది...? పరాయివాడు జగన్.. ఇప్పుడు మా వాడు గా ఎలా మారాడు...? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి... కుల రాజకీయాలు చేస్తున్నాడని, కుల పిచ్చి ఉందని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి... స్వరం ఆకస్మికంగా మారింది. జగన్ మావోడే. పవర్లోకి వచ్చాడు.
కంగ్రాట్యులేషన్స్ టు హిమ్. ప్రత్యేక హోదా విషయంలో జగన్ మొదట్నించి నిజాయితీగా ఉన్నాడు. ఏపీ ప్రత్యేక హోదా సాధిస్తాడు. ఢిల్లీ మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు అద్భుతం. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు మోదీ సాధించటం... మన ఖర్మ... అని, జగన్ బాగా అన్నాడు. కేంద్రంలో బీజేపీ అత్యధిక మెజార్టీతో పవర్ లోకి వచ్చినందున, తాను (జగన్) నమస్కారం పెట్టటం తప్ప చేసేదేమీ లేదని జగన్ చెప్పటం మంచి పరిణామం. జగన్ మాటల్లో వాస్తవం ఉంది. హోదా కోసం సిగపట్లు.. మెడపట్లకు వెళ్లటం సరికాదని నేను అప్పట్లోనే చెప్పాను.. ఇలా సాగింది... జేసీ దివాకర్ రెడ్డి వాక్ ప్రవాహం. ఇన్ని విషయాలు చెప్పిన ఆయన, తమ కుమారులిద్దరి ఓటమికి కారణాలేమిటో మాత్రం చెప్పలేదు.
జేసీ దివాకర్ రెడ్డి స్వరంలో మార్పు సహజమే. ఆ మార్పు రాకపోతే... జేసీ బ్రదర్స్ కు కష్టం. సీనియర్ బ్రదర్స్ సీనియారిటీ కూడా జూనియర్ బ్రదర్స్ ను (ఇద్దరు కొడుకులను) గెలుపు గుర్రాలను ఎక్కించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ వైభవం సాగినంతకాలం దాని నేతలుగా ఈ సీనియర్ బ్రదర్స్ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత, కాంగ్రెస్ చతికిలపడడంతో, జోరుగా దూసుకెళుతున్న సైకిల్ పైకి ఎక్కారు. గాలి తగ్గి, ముందుకు కదల్లేని స్థితికి చేరగానే దాని నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఈ బ్రదర్స్ ముందున్న పెద్ద కర్తవ్యం... తమ వారసులిద్దరికీ రాజకీయంగా సురక్షితమైన ప్రయాణం సాగించగల మార్గం కావాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 'చేయి' అందుకుంటే గోదాట్లో కలిసినట్టే, 'సైకిల్' పై ప్రయాణించలేరు. ఇక మిగిలింది... 'ఫ్యాన్' కిందకు చేరి, విశ్రాంతిగా రాజకీయాలు చేసుకోవడమే బెటర్. జేసీ బ్రదర్... తాజా వాక్ విన్యాసం వెనుక ఇంత కథ ఉందన్నమాట.