టీడీపీలో 'జగన్ నేత' విభేదాలు: జేసీ X చౌదరి, వీరంగం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు తలెత్తాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చేరికపై.. కార్యకర్తల ముందే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు వీరంగం చేశారు. ఒకరి పైన మరొకరు విరుచుకు పడ్డారు.
అనంతపురం లలిత కళాపరిషత్లో మంగళవారం నిర్వహించిన టీడీపీ సమావేశం రసాభాస అయింది. ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆయన పైన ప్రభాకర్ చౌదరి విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తల ముందే ఎమ్యెల్యేలిద్దరూ వాగ్వాదానికి దిగారు.
ఇరువర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. అక్కడున్న ఫ్లెక్సీలు చించి వేశారు. టీడీపీ సమావేశం రసాభాసగా మారడంతో తాత్కాలికంగా ఇద్దరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికను రద్దు చేస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తర్వాత ప్రకటించారు.
కాగా, మరో రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తడం గమనార్హం. దీనిని జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.