జెడి శీలంపై చీపుర్లు: వైయస్, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం
విజయవాడ/నిజామాబాద్: కేంద్రమంత్రి జెడి శీలం పైన పలువురు సమైక్యవాదులు చీపుర్లు విసిరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం జెడి శీలం హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్తుండగా పలువురు సమైక్యవాదులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు.
చీపుర్లు విసిరారు. సోనియా గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెసు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జెడి శీలం మాట్లాడుతూ... తమకు జరిగిన అన్యాయానికి సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి ఆందోళన ద్వారా అది వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. జరిగినదానికి వీరు రగిలిపోతున్నారని చెప్పారు.
వైయస్, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో దివంగత నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డిల విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. కామారెడ్డిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని, దోమలకొండలో వైయస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో విగ్రహాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, ఢిల్లీలోని సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు నివాసంలో సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై వీరంతా చర్చిస్తున్నారు. విభజన బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని నిర్ణయించారు.