హోదా అంశాన్ని కావాలనే చట్టంలో పెట్టలేదు, చంద్రబాబు పట్టు కోల్పోయారు: జేడీ శీలం
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లేఖ, చంద్రబాబు కౌంటర్ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక హోదా విషయంలో అమిత్ షా వక్రీకరించి మాట్లాడారని ధ్వజమెత్తారు. బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతిస్తుందని ప్రశ్నించారు. యాక్ట్లో లేకున్నా ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పారు. యాక్టును మూడుసార్లు సవరణ చేసి హోదాను ఎందుకు చేర్చలేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రెండేళ్ల క్రితమే కేంద్రంపై టీడీపీ పోరాడితే ఫలితం ఉండేదన్నారు. పరిపాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారన్నారు.
ప్రత్యేక హోదా తెచ్చేది, ఇచ్చేది తామే అని చెప్పారు. కేంద్రం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. పోలవరం పునరావాస ఖర్చు కూడా కేంద్రం పూర్తిగా ఇవ్వాలని విభజన హామీలో ఉందన్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయన్నారు. 2019లో యూపీఏ రావడం ఖాయమన్నారు.