విభజన మంచిదే అంటారు: జెడి, తిరిగి రాను: లగడపాటి
హైదరాబాద్: విభజన మంచిదేనని పదేళ్ల తర్వాత సీమాంధ్ర ప్రజలు భావిస్తారని కేంద్రమంత్రి జెడి శీలం సోమవారం అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎన్నడూ దిగజారి ప్రవర్తించలేదన్నారు. కాంగ్రెసు పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నియంతలు ఉన్నారని ధ్వజమెత్తారు.
దుష్ప్రచారం: కాసు
తన పైన రాజకీయ దుష్ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి గుంటూరులో అన్నారు. తాను కాంగ్రెసు పార్టీని వీడుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఎంత కష్టం, నష్టం వచ్చినా తాను కాంగ్రెసులోనే ఉంటానని, కార్యకర్తల నిర్ణయం మేరకే పార్లమెంటుకు పోటీ చేయాలా లేక అసెంబ్లీకి పోటీ చేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
రాజధాని ఇవ్వకుంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం: కోట్ల
సీమాంధ్ర ప్రాంతంలో ఎవరికీ మెజార్టీ రాదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలులో అన్నారు. సీమాంధ్రలో హంగా తప్పదన్నారు. రాయలసీమ ప్రాంతానికి రాజధాని ఇవ్వకుంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని జోస్యం చెప్పారు.
ప్రజలతోనే: లగడపాటి
తాను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానని విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన ఇబ్రహీపట్నం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, తన వర్గంతో మాట్లాడారు. విజయవాడ ప్రజలు తన పైన చూపిన అభిమానం మరువలేనన్నారు. తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తి లేదన్నారు. రాజగోపాల్ ఫౌడేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు.