బీజేపీలో జీవితకు పదవి, కిషన్ అనలేకపోతున్నారని..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని నియమించారు. ఇందులో ప్రముఖ సినీ నటి, దర్శకురాలు జీవితను అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సోమవారం వెల్లడించారు.
పదిమంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, పదిమంది కార్యదర్శులు, పదకొండు మంది అధికార ప్రతినిధులతో పాటు వివిధ మోర్చాలకు బాధ్యులను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కే దిలీప్ కుమార్ (ఎమ్మెల్సీ), మాజీ ఎమ్మెల్యేలు జి రామకృష్ణా రెడ్డి, ఎం ధర్మారావు, కె సత్యనారాయణ, ఎస్ వెంకటేశ్వర రావులతో పాటు నాగూరావ్ నామాజి, ఎస్ మల్లారెడ్డి, బీ వనిత, జి విజయలక్ష్మి, వెంకటరమణిని ఎంపిక చేశారు.
ప్రధాన కార్యదర్శులుగా చింతా సాంబమూర్తి, టీ ఆచార్య, జీ ప్రేమేందర్ రెడ్డి, డీ ప్రదీప్ కుమార్, శ్రీనివాసులు, కోశాధికారిగా జీ మనోహర్ రెడ్డి, క్రమశిక్షణా సంఘం చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే టీ రాజేశ్వర రావును నియమించారు. సినీ నటి జీవిత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి పీ పుష్పలీల సహా 11 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు.
వెంకయ్యనాయుడి స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదువుతున్నారా?
భారతీయ జనతా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ప్రసంగాలపై కేటీఆర్ మాట్లాడారు. సొంతంగా ఆలోచించడం మానేసిన కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కరెంట్ కష్టాలకు టీడీపీ కారణమైనప్పటికీ, కిషన్ రెడ్డి ఆ పార్టీకే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైనప్పటికీ కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏమీ అనలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
బాబుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: నన్నపనేని
చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నోరుపారేసుకోవడం మానుకుని క్షమాపణ చెప్పాలని శాసనమండలి విప్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు ముందు శ్రీరాంసాగర్, బాబ్లీ, ఆల్మట్టి డ్యామ్ల కారణంగా తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య ఎదురైతే అధికారంలో లేకపోయినా చంద్రబాబు పోరాటాలు సాగించారని గుర్తుచేశారు. అప్పట్లో బాబ్లీ,అల్మట్టిలపై కేసీఆర్ కనీసం నోరెత్తిలేదని ఆరోపించారు.