కుళ్లిన పార్టీలో ఉండలేకనే: బిజెపిలోకి జీవితా రాజశేఖర్
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటులు, దర్శకులు జీవిత రాజశేఖర్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశాన్ని కాపాడగలిగేది బిజెపి మాత్రమేనని ఆమె అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోడీ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను కుళ్లిపోయిన పార్టీలో ఉండలేక బిజెపిలే చేరానని చెప్పారు. తాను పార్టీలోకి రావడానికి మోడీయే కారణమన్నారు. దేశంలో ప్రజలంతా మోడీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ గురించి ఆలోచించలేదన్నారు. తన భర్త రాజశేఖర్ త్వరలో చేరుతారన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... జీవిత రాజశేఖర్ బిజెపిలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. వారు ఇటీవల తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ను కలిశారని, వారి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ రాజీనామా చేశానని చెప్పడం విడ్డూరమన్నారు. మార్చి 11న హైదరాబాదులో జరగనున్న బహిరంగ సభకు జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ వస్తారన్నారు.