పవన్ కళ్యాణ్పై వ్యాఖ్య: జీవితా రాజశేఖర్ ఫైర్, చిరుపైనా
హైదరాబాద్: సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికలప్పుడు కొత్త పార్టీలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై సినీ దంపతులు రాజశేఖర్, జీవిత మండిపడ్డారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పడు కెసిఆర్ వ్యాఖ్య చేశారు. జీవిత, రాజశేఖర్ కెసిఆర్ను తప్పుపడుతూ సినిమావాళ్లు గంగిరెద్దులు కాకరని అన్నారు.
స్వార్ధపర పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదని, కేవలం బిజెపి వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సినీనటుడు రాజశేఖర్ అన్నారు. తన భార్య జీవితతో కలిసి గురువారం నాడు రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. తాము బిజెపిలో చేరకున్నా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే గందరగోళం నెలకొనడం వల్లనే తాము ఆ పార్టీని వీడామని అంతకు మించి కారణాలు లేవని చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, వైయస్ కుమారుడికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని వారన్నారు. తన శ్రీమతి జీవితతో కలిసి తమది ఐరన్లెగ్ అని దుష్ప్రచారం చేస్తున్నారని అది సబబుకాదని తమది గోల్డెన్ లెగ్ అని సినీనటుడు రాజశేఖర్ చెప్పారు. తాము పనిచేసిన ప్రతి పార్టీకీ మెరుగైన ఫలితాలే వచ్చాయని చెప్పారు. ఎన్టీఆర్కు అన్యాయం జరగడంతో తాము రాజకీయాలవైపు మొగ్గుచూపామని తొలి దశలో చంద్రబాబును వ్యతిరేకించినా తర్వాత తాము మద్దతు ఇచ్చామని అన్నారు.
మహానటుడని చిరంజీవిపై వ్యాఖ్య
అయితే టిడిపిలో తాము చేరలేదని తొలుత కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చేరామని తాజాగా బిజెపిలో తన సతీమణి జీవిత చేరిందని ఆయన వివరించారు. వైయస్ కోరడంతో తాము ఆ పార్టీలో చేరామని, తర్వాత ఒక మహానటుడు వచ్చి తమను బయటకు పంపించే కార్యక్రమం చేశారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. తాము రాజకీయాల్లో చేరి ఏదీ ఆశించలేదని, తమ సొంత డబ్బునే ఆయా పార్టీలకు ఖర్చు చేశామని అన్నారు.
బిజెపి స్వతంత్రంగా పోటీ చేసే ఉంటే బావుండేదని, అందరికీ అవకాశం దక్కేదని అయితే జాతీయ నాయకత్వం సూచన మేరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుందని అన్నారు. ఓటర్లు జీవితకాలం ఒకే పార్టీకి ఓటు వేయడం లేదని ఓటరు పార్టీ మారితే ఎవరూ ఏమీ అనడం లేదని తాము పార్టీ మారితే ఎందుకు మీడియా నిలదీస్తోందని ప్రశ్నించారు. మంచి పరిపాలన అందిస్తారని భావించి తాము గతంలో కాంగ్రెస్లోకి వచ్చామని ఇపుడు మోడీ వల్లనే దేశానికి లాభం అని భావించి బిజెపిలో చేరామని అన్నారు.
సినీనటులు గంగిరెద్దులని తెరాస అధినేత కెసిఆర్ అనడం భావ్యం కాదని గతంలో సినీనటులే ఎన్టిఆర్, ఎంజిఆర్, జయలలితలు ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పారు. సినిమా వాళ్లను తక్కువ చేసి మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ బిజెపి అధికార ప్రతినిధి జీవిత, రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.