నేను చేసింది నేరంకాదు, మధ్యవర్తిత్వమే!, ఆ పార్టీల నుంచి ప్రాణహాని: జెరూసలేం మత్తయ్య
విజయవాడ: ఓటుకు నోటు కేసులో తాను ఎలాంటి నేరాలకు, అక్రమాలకు పాల్పడలేదని ఆ కేసులో ప్రధాన ముద్దాయి జెరూసలెం మత్తయ్య అన్నారు. ఇంకా చెప్పాలంటే.. అటు టిఆర్ఎస్, ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు పడిపోకుండా ఉండేందుకు మధ్యవర్తిత్వం వహించానని సమర్థించుకున్నారు.
ఆదివారం సాయంత్రం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా వెల్లడైన వాయిస్ రికార్డులో గొంతు తనదేనంటూ ఖరారు కావటంపై తానేమీ ఆశ్చర్యపోవటం లేదన్నారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించినట్టుగా తనపై ఎలాంటి ఆధారాలు లేవని, అవసరమైతే దీనికి సంబంధించిన విజువల్స్ హైకోర్టులో సీల్డ్ కవర్లో ఉన్నాయని చెప్పారు.
తొలుత రెండు ప్రభుత్వాలు కత్తులు దూసుకున్నాయని, అయితే ప్రస్తుతం సామరస్యంగా ముందుకు సాగుతున్నాయని, అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాలను కూల్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయన్నారు.
ఈ కేసులో ప్రధాన పాత్రధారి అయిన స్టీఫెన్సన్ కొన్ని ఇబ్బందుల్లో ఉండగా తాను కొందరితో కలవటం జరిగింది కానీ వేరే దురుద్దేశం లేదని చెప్పారు. ఆ సమయంలో తాను గుంటూరులోని బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో బెదిరింపులు వస్తుండటంతో విజయవాడలో దిగి సత్యనారాయణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు లేనప్పటికీ కాంగ్రెస్, వైయస్పార్ కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. క్రిస్మస్ పండుగను ప్రభుత్వ పండుగగా జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పందించకపోవటం బాధాకరమన్నారు.
క్రైస్తవ మతం నుంచి ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయాలని జెరూసలెం మత్తయ్య డిమాండ్ చేశారు. అందుకే మరో రెండు రోజుల్లో తాను క్రైస్తవ పెద్దలతో ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు. క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా ప్రకటించి వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.