ఓటుకు నోటు: జెరూసలేం మత్తయ్యని ఏపీ పోలీసులే రక్షిస్తున్నారా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్య ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంరక్షణంలో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయమై ఏపీ డీజీపీ జేవీ రాముడు పరోక్షంగా మత్తయ్య విషయమై మాట్లాడారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా రక్షణ కోరితే వారిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదని చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించి జేవీ రాముడు ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఎవరైనా తమకు రక్షణ కావాలని కోరితే, వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రక్షణ కల్పిస్తారని చెప్పారు.
ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాము ఐపిఎస్ల అని, తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత ఏదోనా రెండో ప్రాధన్యతే అన్నారు. ఓటుకు నోటు కేసు నిందితుడు జెరూసలేం మత్తయ్యను ఏపీ పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణలను విలేకరులు ప్రస్తావించారు.
దీనిపై జెవి రాముడు స్పందించారు. అయితే, ప్రత్యేకంగా ఒకరి పేరును పేర్కొనలేదు. పోలీసులు ఎవరి పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరించరని చెప్పారు. అయితే, విషయం కోర్టులో ఉందని, ఫిర్యాదుదారులను రక్షించడం పోలీసుల బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, విశాఖఫట్నం పోలీసు కమిషరేట్ పరిధిలోని పెందుర్తి పోలీసు స్టేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావు గన్మన్, అనుచరులపై నమోదైన కేసును సిల్లీ కేసుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి జెవి రాముడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఓటు నోటు కేసులో నిందితుడు మత్తయ్య తమకు ఫిర్యాదుదారుగానే తెలుసున్నారు. కెటిఆర్ గన్మన్, అనుచరులపై నమోదైన కేసు సిల్లీ కేసు అని, అలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉండవని, రోటీన్గా నోటీసులు ఇచ్చి ఇంటారని, స్థానిక పోలీసులను అడగండని ఆయన చెప్పారు.