తెలుగువారు మృతి.. డిప్యూటీ సీఎం స్పందన
న్యూఢిల్లీ: జార్ఖండ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగువారికి మెరుగైన చికిత్స అందించాలని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మత్రి చిన రాజప్ప కోరారు. జార్ఖండా హోం మంత్రికి చినరాజప్ప శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు.
ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాద ఘటనలో మరణించిన మూడు మృత దేహాలను స్వస్ధలానికి పంపేందుకు తిగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు.
హోం మంత్రి చినరాజప్ప చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన జార్ఖండ్ హోం మంత్రి మృతదేహాలను స్వస్ధాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని, క్షతగాత్రలకు అవసరమైన చికిత్స అందిస్తామని వెల్లడించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది.
కాశీయాత్రకు వెళ్లి వస్తున్న అయ్యప్ప భక్తులు జార్ఖండ్లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీ - కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు శ్రీకాకుళం జిల్లా రాజాం వాసులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది.