ఇవి ఇచ్చాం: బాబుకు కేంద్రమంత్రి లెక్క, 'పవన్ కళ్యాణ్ మోడీని ప్రశ్నించరేం'
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా రగడ రాజుకుంటోంది. విపక్షాలతో పాటు మిత్రపక్షం టిడిపి కూడా బీజేపీపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చామనే అంశంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం నాడు రాజ్యసభలో ప్రకటించారు.
ఏపీకి మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన ఆర్థిక సాయంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తాము విడుదల చేసిన నిధుల్లో రెవెన్యూ లోటు కింద రూ.2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు (ఉత్తరాంధ్ర, రాయలసీమ) రూ.700 కోట్లు, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.2050 కోట్లు, పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.
జైట్లీతో సుజన 'ఆర్థిక' మంతనాలు, మోడీ కోసం సుజన ప్రయత్నం
పవన్ కళ్యాణ్ ప్రశ్నించరేం: రామకృష్ణ
తాను ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. హోదా అంశంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల వైఖరిపై ఆయన మండిపడ్డారు.
గత ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ పవన్ ప్రచారం చేశారని, ఇప్పుడు మోడీని ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నించాలన్నారు. విభజన జరిగి రెండేళ్లైనా ఏపీకి హోదా తెచ్చుకోలేకపోయారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపిన పార్టీలతో కలిసి చంద్రబాబు ప్రధాని మోడీ సమావేశం కావాలన్నారు. వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా పైన పోరాడకుండా కేంద్రమంత్రి పదవి కోసమే ప్రాకులాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.