పెళ్లి చేసుకుంటుందని.. యువతిని దారుణంగా చంపేసి యువకుడి ఆత్మహత్య!
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. యువతిని కిరాతకంగా హత్య చేసి, ఆ తర్వాత యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పోలవరం బాపూజీ కాలనీలో జరిగింది. ఆమెను కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి చనిపోయాడు.
మృతి చెందిన వారు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్లుగా గుర్తించారు. లహరి ఓ బట్టల దుకాణంలో పని చేస్తోంది. కిరణ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారని సమాచారం.
కొత్త ట్విస్ట్: మలుపు తిరిగిన యాంకర్ తేజస్విని ఆత్మహత్య కేసు
ప్రేమ పేరుతో వేధింపులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టి.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంకు చెందిన కిరణ్ ఆటో డ్రైవర్. జంగారెడ్డిగూడెం బస్టాండు ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో పని చేస్తున్న లహరితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
ప్రేమను ఎప్పటికప్పుడు తిరస్కరించింది
లహరి మాత్రం ఎప్పటికి అప్పుడు కిరణ్ ప్రేమను తిరస్కరిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరానికి చెందిన సతీష్ అనే యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.
హత్య చేసి, ఆత్మహత్య
దానికి లహరి ససేమీరా అన్నది. దీంతో తనతో తెచ్చుకున్న కత్తితో అతను లహరి గొంతు కోసి పరారయ్యాడు. సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
మరో వాదన
కాగా, మరో వాదన కూడా వినిపిస్తోంది. లహరి, కిరణ్లు ప్రేమించుకున్నారని, ఆ తర్వాత విడిపోయారని, ఇప్పుడు లహరి మరొకరిని ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసి ఆమె ఇంటికి వచ్చి నిలదీసి, విచక్షణారహితంగా పొడిచి చంపేశాడని అంటున్నారు. పక్కనే ఉన్న ఆమె తమ్ముడు అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. దీంతో అతను కూడా గాయపడ్డాడు.