కాకినాడ జెఎన్టియు కీచక ప్రొఫెసర్ పై వేటు; విద్యార్థుల ఆందోళనతో విసి చర్యలు
తూర్పుగోదావరి: విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరుతూ కాకినాడ జేఎన్టీయూ ఎంటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ(ఐఎస్టీ) డైరెక్టర్, యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ కాకినాడ(యూసీఈకే) ఈసీఈ ప్రొఫెసర్ కె.బాబులుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
ప్రొఫెసర్ కె.బాబులును పీజీ, ఐఎస్టీ డైరెక్టర్ విధుల నుంచి తక్షణమే తొలగించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంటెక్ విద్యార్థులు ఆదివారం సాయంత్రం జేఎన్టీయూకే ప్రధాన ప్రవేశద్వారం వద్ద బైఠాయించి, నినాదాలు చేశారు. ప్రొఫెసర్ బాబులును రెండు విధుల నుంచి తొలగిస్తున్నామని వీసీ కుమార్ చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఎంటెక్ మొదటి సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు ముందు నిర్వహించే వైవాను ల్యాబ్లో నిర్వహించాల్సి ఉండగా, ప్రొఫెసర్ కె.బాబులు మాత్రం తన చాంబర్లో నిర్వహించారని, ఆ సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు ఆరోపించారు.
ఘటన పూర్వాపరాలపై విచారణకు కమిటీ వేయాలని రిజిస్ట్రార్ సుబ్బారావును వీసీ వీఎస్ఎస్ కుమార్ ఆదేశించారు. విచారణ కమిటీ ఆదివారం బాధిత విద్యార్థినులతో పాటు అభియోగం ఎదుర్కొంటున్న బాబులును వేర్వేరుగా విచారించింది. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో ఐసీడీఎస్ పీడీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీతామహాలక్ష్మి బాధితులతో విడిగా చర్చించారు. విద్యార్థులు ఎంతకూ శాంతించకపోవడంతో ప్రొఫెసర్ బాబులును రెండు విధుల నుంచి తొలగిస్తున్నామని వీసీ కుమార్ ప్రకటించిన మీదట విద్యార్థులు ఆందోళన విరమించారు.