ఇక్కడ ఉద్యోగాలు అమ్మబడును...ఒక్కో పోస్టు రూ.6 లక్షలు:వినూత్న నిరసన
విజయనగరం జిల్లా: కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తామని విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం తీసుకొని...చివరకు స్థలం యజమానులకు చెప్పకుండా ఉద్యోగాలను అమ్ముకున్న ప్రజాప్రతినిథులకు వ్యతిరేకంగా స్థానిక యువకులు వినూత్న నిరసన తెలిపిన ఉదంతమిది...
ఇక్కడ ఉద్యోగాలు అమ్మతారంటూ... ఒక్కో పోస్టు ధర 6 లక్షల రూపాయలు మాత్రమే నంటూ సబ్ స్టేషన్ ఎదుట ఫ్లకార్డులు ప్రదరిస్తూ ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.వివరాల్లోకి వెళితే...
నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ డి.నెలివాడ గ్రామంలో ఇటీవలే సబ్స్టేషన్ను కొత్తగా నిర్మించారు. ఆ గ్రామానికి చెందిన చందక అప్పలనాయుడు అనే రైతును కుటుంబంలో ఒకరికి సబ్స్టేషన్లో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని...అలాగే ఐటీఐ చేసిన స్థానిక నిరుద్యోగ యువతకు ఇదే సబ్ స్టేషన్ కు సంబంధించి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం కల్పిస్తామని కొంతమంది అధికార పార్టీ నేతలు నమ్మబలికి ఆ స్థలాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే సబ్ స్టేషన్ పూర్తి కావడంతో ఉద్యోగాల కోసం ఆ స్థల యజమానితో పాటు స్థానిక యువకులు ఆశగా నిరీక్షిస్తున్నారు.
అయితే ఉన్నట్లుండి వారికి వినిపించిన ఒక వార్త వాళ్లకి ఆశనిపాతంలా తగిలింది. కొద్ది రోజుల క్రితమే సబ్స్టేషన్లోని పోస్టుల్ని అమ్ముకున్నారన్న సమాచారం తెలియడంతో స్థానిక యువత ఆగ్రహంతో మండిపోయి సబ్స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు "ఇక్కడ ఉద్యోగాలు అమ్మబడును...ఒక్కో పోస్టు ధర రూ.6 లక్షలు"...అని రాసివున్న ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక యువకులు మాట్లాడుతూ...సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన అప్పలనాయుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన నాయకులు మాటతప్పారన్నారు. అలాగే పోస్టుల భర్తీ విషయం లోనూ స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వకుండా...బైటవారికి అమ్ముకోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నాయకుడే ఈ విధంగా పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.