జగన్పై హత్యాయత్నం కేసు: జోగికి నోటిసులు, బాబుపై జగన్ పార్టీ రివర్స్ ప్లాన్
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నంలో కత్తి దాడి జరిగిన ఘటనలో వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు (మంగళవారం) గుంటూరు పోలీసుల ముందు వైసీపీ నేత జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు.
చంద్రబాబు ఏమన్నాడో చూడండి: అమితాబ్ బచ్చన్ ట్వీట్తో పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్
టీడీపీ కార్యకర్త అన్నందుకు జోగి రమేష్కు నోటీసులు
వైయస్ జగన్ పైన దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని జోగి రమేష్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపత్యంలో ఆయనకు ఆరండల్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం పోలీసుల ఎదుట హాజరు కానున్నారు.
టీడీపీకి షాకిచ్చేలా వైసీపీ ప్లాన్
జగన్ పైన దాడి చేసింది టీడీపీ కార్యకర్త అని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. జగన్ పైన దాడి చేసింది వైసీపీ అభిమాని అని చంద్రబాబు ప్రకటన చేశారని, దీనిపై ఫిర్యాదు చేసే ఆలోచనలో వైసీపీ ఉందని తెలుస్తోంది.
శ్రీనివాస రావు భయపడుతున్నాడు
మరోవైపు, జగన్ పైన దాడి చేసిన ఘటనలో నిందితుడు శ్రీనివాస రావు తరఫున న్యాయవాది అబ్దుల్ సలీం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడారు. తాను శ్రీనివాస్ను కలిశానని, అతను కోరితేనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తాను శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడలేదన్నారు. తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారని శ్రీనివాస్ భయపడుతున్నాడని చెప్పారు. పోలీస్ కస్టడీలో ప్రాణహానీ ఉందని చెప్పాడని, అతనిని జైల్లో హై సెక్యూరిటీ జోన్లో ఒంటరిగా పెట్టారని చెప్పారు.
కోడి కత్తి కేసును సీరియస్గా తీసుకున్నాం
జగన్ పైన దాడి యత్నంపై హోంమంత్రి చినరాజప్ప మాట్లాడారు. కోడి కత్తి కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పారు. జగన్ విచారణకు సహకరించడం లేదన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. అదే సమయంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చెప్పలేమన్నారు. చంద్రబాబు రాజకీయ సన్యాసం అన్న పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. జనసేన, బీజేపీ లేకుండానే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తాము గతంలో గెలిచామని చెప్పారు. పార్టీ పెట్టడం సీన్ అయిపోయాక సినిమాలు తీసుకోవడం వాళ్లకు (చిరంజీవి, పవన్ కళ్యాణ్) అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. పవన్ కూడా చిరంజీవిలా చేస్తారేమో అన్నారు. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు సమంజసమే అన్నారు.