దేవినేనికి పిచ్చికుక్క కరిచింది, కొడతారు: స్కాంలోకి లోకేష్ను లాగిన జోగి
విజయవాడ: సదావర్తి భూములను టిడిపి నేతలు స్వాహా చేశారని, దాని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోందని వైసిపి నేత జోగి రమేష్ ఆదివారం నాడు ఆరోపించారు. అదే సమయంలో ఆయన మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేవినేని నోటిని అదుపులో ఉంచుకోవాలన్నారు. పోలీసు పహారా లేకుండా దేవినేని తిరగగలరా అని ప్రశ్నించారు. దేవుడు కరుణిస్తే తప్ప నీళ్లివ్వలేని దద్దమ్మ దేవినేని అన్నారు. కృష్ణా డెల్టాలో 3 పంటలు పోయాయన్నారు.
దేవినేని అంతటి నీచమైన, అజ్ఞాన, అసమర్థ నీటి పారుదల మంత్రిని ఇంత వరకు చూల్లేదన్నారు. దేవినేని వంటి దద్దమ్మ వల్ల పులిచింతల ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. రూ.1600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి, రూ.500 కోట్లు నొక్కేశారని ఆరోపించారు. గోదావరి జలాలు ఎక్కడ కలుస్తున్నాయో చెప్పాలన్నారు.
జూన్లో కృష్ణా డెల్టాకు నీరు అని చెప్పారని, ఏమైందని నిలదీశారు. మీ దోపిడీ దుర్మార్గాలకు జగన్ అడ్డుపడటమే తప్పా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులే కాదు, కృష్ణా పుష్కరాల్లోను దోపిడీ జరుగుతోందన్నారు. ప్రజల డబ్బు దోచుకుంటున్నప్పుడు ప్రశ్నించడం తప్పా అన్నారు.
ఇసుక నుంచి మట్టి వరకు దోపిడీ చేశారన్నారు. అందులో మీ వాటా లేదని కనకదుర్గమ్మ సాక్షిగా చెప్పగలరా అని సవాల్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల పైన వైసిపి ప్రశ్నించిందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదని, ఉమ ప్రశ్నించలేదన్నారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి జగన్ మాట్లాడితే టిడిపి నేతలు భయపడి పోరిపోయి వచ్చారన్నారు. దేవుడు కరుణిస్తే తప్పు దేవినేని సొంత నియోజకవర్గానికి కూడా నీళ్లివ్వలేరన్నారు. తనతో కలిసి కృష్ణా డెల్టాకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేశారు. అలా వస్తే దేవినేనిని ప్రజలు కొడతారన్నారు. ఆయనకు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచిందని, అందుకే అమావాస్య, పౌర్ణమిల నాడు విచిత్రంగా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు.
దేవుడి భూములు కూడా దోచుకుంటున్నారన్నారు. సదావర్తి భూములను కొట్టేస్తున్నారన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్ పాత్ర ఉందంటున్నారని, ఆయన పాత్ర బయటకు రావాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు.
అంతకుముందు తప్పు జరిగిందని చెప్పారని, ఇప్పుడు సరిగానే ఉందని చెప్పడం ఏమిటన్నారు. టిడిపి వాళ్లు తప్పు చేసారని, దానిని బీజేపీ లేదా మంత్రి మాణిక్యాల రావు నిర్భయంగా బయటపెట్టాలన్నారు. మీరు (బీజేపీ) తప్పు చేయలేదన్నారు. సదావర్తి 83 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని టిడిపి పైన మండిపడ్డారు.