‘దీనెమ్మ బడవా.. ఎలా పుడతాయో ఇలాంటి వార్తలు’..: తేల్చేసిన మేకపాటి
తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలపై ఏంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
అమరావతి: తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలపై ఏంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
తాను పార్టీ మారుతున్నట్లు, బీజేపీలో చేరబోతున్నట్లుగా వచ్చిన వార్తల విషయంలో ఇసుమంతైనా నిజం లేదని మేకపాటి స్పష్టం చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు సోనియాగాంధీ మహారాణిగా వెలుగొందుతున్నారని, ఆ సమయంలోనే తాను వైఎస్ఆర్సీపీలో చేరానని ఆయన గుర్తు చేశారు.
"ఈ మధ్యాహ్నం ఉదయగిరి నుంచి నాకెవరో ఫోన్ చేశారు. ఏంటి సార్ ఇలా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని అడిగారు. దీనెమ్మ బడవా అని... నేనూ అతనితో కాస్త కఠినంగానే మాట్లాడా. అతను నాకు బాగా తెలిసిన శ్రేయోభిలాషే. ఇంతకుముందే మరొకతను కూడా వచ్చి అదే అడిగాదు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అసలెట్లా పుడతాయో ఇటువంటి వార్తలు" అని మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తన కుటుంబ వ్యాపారానికి, తన రాజకీయ జీవితానికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు చేసుకునే తన కుమారులు అప్పుడప్పుడూ తనకు డబ్బులిస్తుంటారని చెప్పారు. నంద్యాలలో టీడీపీ గెలుపు గురించి మాట్లాడుతూ అందంతా అధికార దుర్వినియోగంతోనే జరిగిందని వ్యాఖ్యానించారు.