టిడిపిలోకి చేరికలు: మాగుంట, సాయి! తెలంగాణలోను
వీరిలో ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట ఈసారి నెల్లూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అది ఇప్పటికే వేరొకరికి ఖాయం అయింది. ఆయన పేరును ఒంగోలుకు పరిశీలించడానికి టిడిపి సుముఖంగా ఉంది. దీంతో, మళ్లీ ఒంగోలు నుంచే పోటీ చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారని అంటున్నారు. సాయిప్రతాప్ ఈసారి కూడా సుదీర్ఘకాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట ఎంపీ సీటును కోరుకొంటున్నారు.
అక్కడ ఆయనకు కొంత పోటీ ఉన్నా టిడిపి నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, ఆయన టిడిపి వైపు తన కదలికలను పెంచారంటున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ కూడా సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. పార్టీలో చేరడానికి తనకు ఆసక్తి ఉందన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా, కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతి సోమవారం రాత్రి హైదరాబాద్లో చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. గుప్తా ఇప్పుడు కూడా గుంతకల్లు సీటును ఆశిస్తుండగా పద్మజ్యోతి ఎక్కడైనా ఎంపీ సీటును కోరుకొంటున్నారు. వీరి అభ్యర్థనలపై కసరత్తు జరుగుతోందట.
ఇక, రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్న మహారాజుల కుటుంబానికి చెందిన సోదరులు నరేశ్, దినేశ్ మంగళవారం చంద్రబాబును కలిశారు. వీరిలో నరేశ్ మాజీ మంత్రి మాణిక్రావు కుమారుడు. ఆయనకు ఈసారి తాండూరు టికెట్ ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. అక్కడ టిడిపి సిటింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి తెరాసలోకివెళ్లడంతో టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి వీరిని తీసుకొని వచ్చారు.
అలాగే, హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ స్వప్నా రెడ్డి కూడా మంగళవారం చంద్రబాబును కలిశారు. నల్లగొండ జిల్లాకు చెందిన దివంగత టిడిపి నేత ఎలిమినేటి మాధవ రెడ్డి సోదరుని కుటుంబానికి చెందిన ఆమె ఈసారి ఆ జిల్లాలోని భువనగిరి లేదా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల స్థానంలో పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి టికెట్ను ఆశిస్తూ యువనేత బిర్జేపల్లి వెంకటేశ్ బాబు మంగళవారం చంద్రబాబును కలిసి తన అభ్యర్థనను అందజేశారు.