జోని కుమారి భర్త భిన్న స్పందన.. ఆమె టీడీపీ ఆర్టిస్టన్న వైసీపీ శ్రేణులు.. అనిత అనూహ్య కామెంట్లు..
''వైసీపీని సొంత కుటుంబంలా భావించాను. కానీ పార్టీ నన్ను మోసం చేసింది. కొద్ది రోజుల కిందటే ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి విషయం వివరించాను. ముఖ్యమంత్రి జగన్ ఎంతకీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి సోషల్ మీడియా ద్వారా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. పార్టీ చేతిలో అన్ని రకాలుగా మోసపోయిన నన్ను బతికించే ప్రయత్నం చేయొద్దు''.. అంటూ లైవ్ ప్రెస్ మీట్ లో.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు విజయవాడ వైసీపీ మహిళా నేత జోని కుమారి. ఆమె మాల మహానాడు మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా కావడంతో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది.
జగన్పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?
భర్త భిన్న స్పందన..
పార్టీ వల్ల దారుణంగా మోసపోయినందుకే ప్రాణాలు తీసుకోవాలని డిసైడయ్యానంటూ జోని కుమారి విషం తాగడం, టీవీల్లో ప్రసారమైన ఆ దృశ్యాలు వైరల్ కావడం, జర్నలిస్టుల చొరవతో పోలీసులు ఆమెను సకాలంలో ఆస్పత్రిలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోని కుమారి ఆత్మహత్యాయత్నంపై ఆమె భర్త భిన్నంగా స్పందించారు. పార్టీతోగానీ, ముఖ్యనేతలతోగానీ ఇప్పటిదాకా తమకు ఎలాంటి విభేదాలు, సమస్యలు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
గూఢార్థం ఏంటో తెలీదు..
‘‘జోని ఇలా చేయడంలో గూఢార్థం ఏంటో నాకు తెలీదు. మా ఇద్దరికీ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు. పార్టీకి, మాల మహానాడుకు ఆమె యాక్టివ్ గా పనిచేస్తుంది. చేతనైనంతలో తను అందరికీ సహాయం చేస్తుంది. అలాంటిది ఆమె ఎందుకిలా చేసిందో నాకూ అర్థంకావట్లేదు. స్పృహ వచ్చిన తర్వాతే ఏదైనా తెలుస్తుంది. ప్రస్తుత సమయంలో పార్టీ ముఖ్యనేతలు అన్ని విషయాలను పట్టించుకోవడం కష్టం. బహుశా మాల మహానాడు నుంచే ఏదైనా సమస్యలు ఎదురై ఉండొచ్చు. ప్రత్యేకంగా వైసీపీ నుంచి ఒత్తిళ్లు ఎదురై ఉంటాయని నేను అనుకోవడం లేదు'' అని జోని కుమారి భర్త మీడియాకు వివరించారు.
రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణ
ఆమె టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్..
జోని కుమారి ఆత్మహత్యయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అధికార వైసీపీకి చెందిన మహిళా నేత కావడంతో జాతీయ స్థాయిలోనూ ఈ వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జోని కుమారికి టీడీపీతో సంబంధాలున్నాయని, ఇప్పటికీ ఆమె చంద్రబాబు నియమించిన పెయిడ్ ఆర్టిస్టులా నటిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన ప్రముఖులంతా.. చంద్రబాబు, దేవినేని ఉమతో జోని కుమారి దిగిన పాత ఫొటోలతో ఎదురుదాడికి దిగారు. డాక్టర్ సుధాకర్ ను మహానటుడిగా, జోని కుమారిని మహానటిగా పేర్కొంటూ వైసీపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ కు దిగాయి.
Recommended Video
అసభ్య పదజాలంతో వేధింపులు..
గతంలో వైసీపీ సర్కారును విమర్శించి పలు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న డాక్టర్ సుధాకర్, ఇప్పుడు ఆత్మహత్యకు యత్నించిన జోని కుమారి ఇద్దరూ దళితులే కావడం గమనార్హమని, దీన్ని బట్టి జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి తేలిపోయిందని టీడీపీ విమర్శించింది. టీడీపీ మహిళా విభాగం చీఫ్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. జోని కుమారి ఘటనపై స్పందిస్తూ.. తాను కూడా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని, అసభ్యపదజాలంతో వైసీపీ శ్రేణులు వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, చివరికి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదని ఆమె అన్నారు.
మహిళా హోంమంత్రి ఉండగానే..
‘‘వైసీపీ సీనియర్ నేతల కారణంగా ఆ పార్టీ మహిళా నాయకురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. వైసీపీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉండగానే ఇన్ని దారుణాలు, అన్యాయాలు జరుగుతుండటం బాధాకరం. ఏపీలో మహిళలకు న్యాయం దొరకట్లేదు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవట్లేదు. కనీసం రాబోయే రాఖీ పౌర్ణమి రోజైనా మహిళల్ని కాపాడుతారని, దిశ చట్టాన్ని కనీసంగానైనా అమలు చేయాలి'' అని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.