కూల్డ్రింక్లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనం
అధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాల మహానాడు మహిళా విభాగం బాధ్యురాలైన జోని కుమారి ఆత్మహత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలే తనకు అన్యాయం చేశారంటూ విజయవాడలో నిర్వహించిన లైవ్ ప్రెస్ మీట్ లో ఆమె విషం సేవించిన ఘటనపై అన్ని జాతీయ చానెళ్లూ వార్తల్ని ప్రసారం చేశాయి. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు తన సమస్యలపై జోని కుమారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఓ లేఖ కూడా రాసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె సంచలన విషయాలను పేర్కొన్నారు.
జోని కుమారి భర్త భిన్న స్పందన.. ఆమె టీడీపీ ఆర్టిస్టన్న వైసీపీ శ్రేణులు.. అనిత అనూహ్య కామెంట్లు..
గుంటూరు ఆస్పత్రిలో చికిత్స..
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బొల్లిపల్లి శాంతకుమార్ అలియాస్ జోని కుమారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో సభ్యురాలు. సోమవారం విజయవాడ గాంధీనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. సొంత పార్టీ నేతల చేతిలో మోసపోయానని, 15 రోజుల కిందటే ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, అయినాసరే ఫలితం లేకపోవడంతో చావడానికి నిర్ణయించుకున్నానంటూ విషం సేవించారు. ఆ వెంటనే మీడియా సహకారంతో పోలీసులు ఆమెను ఈఎస్ఐ ఆస్పత్రికి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సీఎంకు రాసిన లేఖలో సంచలనాలు..
తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సీఎం జగన్కు రాసిన లేఖలో జోని కుమారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్ది నెలల కిందట ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎంపీ భర్తతో తనకు పరిచయం ఏర్పడిందని, రాష్ట్ర ఎస్సీ కమిషన్లో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని ఆ ఎంపీ భర్త ఆశపెట్టాడని, ఇందుకుగానూ సీఎం జగన్ సన్నిహితుడితోపాటు మరికొంతమందికి రూ.13లక్షలు లంచంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడని జోని కుమారి పేర్కొన్నారు. ఫార్మాలిటీ ఖర్చుల కోసం రూ.13 లక్షలు అడగ్గా, అప్పటికప్పుడు తన వద్ద ఉన్న రూ.7 లక్షలను ఎంపీ భర్తకు ఇచ్చేశానని, తర్వాత జూన్ 18న తాము విశాఖపట్నంలో కలుసుకున్నామని, అప్పుడా ఎంపీ భర్త.. తన అనుచరులను పురమాయించి.. మొబైల్ ఫోన్ లాగేసుకుని.. డబ్బుల విషయమై చేసిన చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్లను డిలిట్ చేశారని మహిళా నేత లేఖలో రాశారు. ఆ తర్వాత..
తప్పు ఒప్పుకున్న ఎంపీ భర్త..
విశాఖలో ఎంపీ భర్తను కలిసిన సందర్భంలో తాను భయానక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని జోని కుమారి లేఖలో ప్రస్తావించారు. ఎంపీ, ఆయన అనుచరులు.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తనతో తాగించారని, ఆ తర్వాత ఎలాగోలా అక్కణ్నుంచి తప్పించుకున్నానని ఆమె తెలిపారు. ఎంపీ భర్త మోసం చేసిన తీరుపై జూన్ 27 న ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి ఫిర్యాదు చేశానని, దాంతో ఆయన ఎంపీతోపాటు ఆమె భర్తను కూడా పిలిపించి మాట్లాడారని, ఎంపీ భర్త తన తప్పును ఒప్పుకుని, తీసుకున్న డబ్బుల్ని తిరిగిచ్చేస్తానని కూడా అంగీకరించారని జోని చెప్పుకొచ్చారు. అయితే, ఎంతకూ డబ్బులు తిరిగివ్వకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని కలిసి విషయం మొత్తం చెప్పానని, ఆయన కూడా వాళ్లను పిలిపించి మాట్లాడతానని చెప్పినప్పటికీ రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాలేదని లేఖలో రాసుకొచ్చారు. జోని కుమారి లేఖపై వైసీపీ స్పందించాల్సి ఉంది.
జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్
రాజకీయ దుమారం..
జోని కుమారి ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్ర హోం మంత్రిగా మహిళ ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయిందని, జోని కుమారి పట్ల వైసీపీ నేతలు ఇంత దారుణంగా ప్రవర్తించినా, వారిపై చర్యలు తీసుకోకపోవడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నదని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. కాగా, జోని కుమారికి టీడీపీతో సంబంధాలున్నాయని, ఆమె చంద్రబాబు నియమించిన పెయిడ్ ఆర్టిస్ట్ అని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఎదురుదాడికి దిగాయి. ఈ విషయంలో వైసీపీ పెద్ద నేతలెవరూ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం.
వైసీపీతో విభేదాల్లేవు.. సంఘంతోనే..
రాజకీయ దుమారానికి కారణమైన జోని కుమారి ఆత్మహత్యాయత్నంపై ఆమె భర్త మాత్రం మరో రకంగా స్పందించడం విశేషం. వైసీపీ నేతలతోగానీ, కార్యకర్తలతోగానీ తమకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని, ఆత్మహత్యాయత్నం లాంటి తీవ్ర నిర్ణయాన్ని జోని ఎందుకు తీసుకుందో అర్థం కావడంలేదని ఆమె భర్త వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా ఇబ్బందులు లేవని, బహుశా మాల మహానాడు సంఘంలోనే ఎదైనా తీవ్ర సమస్యను ఆమె ఎదుర్కొని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.