అమరావతిలో జాషువా సాంస్కృతిక కేంద్రం:ఏపీ కల్చరల్ అంబాసిడర్గా ఫోక్ సింగర్ లెనిన్ బాబు నియామకం
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కవి కోకిల గుర్రం జాషువా పేరిట సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు పద్మభూషణ్ గుర్రం జాషువా 124వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ నిధులను మంజూరు చేసింది.
ఇందుకోసం రూ. 3 కోట్ల నిధులను ఆ శాఖ కేటాయించింది. రాజధానిలో నిర్మించబోయే సాంస్కృతిక కేంద్రానికి జాషువా కళాప్రాంగణంగా పేరుపెట్టాలని పేర్కొంది. అలానే జాషువా సమాధి వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు అంబాసిడర్గా ఎస్కే లెనిన్బాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
రచయిత, గాయకుడు అయిన ఎస్కే లెనిన్బాబు ను సాంస్కృతిక విభాగం అంబాసిడర్ గా నియమిస్తూ పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకంతో లెనిన్ బాబుకు గౌరవ వేతనం కింద నెలకు రూ.50వేలు గౌరవ వేతనం అందించనున్నారు.
స్పెషల్ ఫోక్ సింగర్గా ఉన్న లెనిన్బాబు రాష్ట్ర సంస్కృతి, తెలుగుభాష ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు. దీనికోసం పాఠశాలలు, కళాశాలలను ఆయన సందర్శించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై యువతలో అవగాహన కల్పిస్తారు.
వనం-మనం కార్యక్రమంతో పాటు యువనేస్తం వంటి పథకాలపై కూడా యువతకు అవగాహన కల్పించి, పర్యావరణ విలువల గురించి తెలియజేస్తారు. లెనిన్ బాబు 2012 లొ వందేమాతరం ప్రతిభా అవార్డుతో తోపాటుగా పలు అవార్డులు గెల్చుకున్నారు.