తణుకు ఎస్కెఎస్డి ఉమెన్స్ కాలేజ్ లో జర్నలిజం కోర్సు ప్రారంభం
పశ్చిమ గోదావరి:రాగద్వేషాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారమయ్యే వరకూ పోరాడటమే నిజమైన జర్నలిజమని సీనియర్ పాత్రికేయులు డి.సోమసుందర్ అన్నారు.
పశ్చిమ గోదావరి ఎస్కెఎస్డి ఉమెన్స్ కాలేజ్ లో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా వారి సహకారంతో జర్నలిజం డిప్లమో కోర్సు ను ప్రారంభించారు. ఈ జర్నలిజం శిక్షణా తరగతులను ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.అరుణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీనియర్ జర్నలిస్ట్ సోమసుందర్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో మీడియా రంగంలో అనేక మార్పులు జరిగి, మరింతగా విస్తరిస్తుందన్నారు.
మీడియా రంగంలో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ప్రస్తుతం మీడియా రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. జర్నలిజం డిప్లమో పూర్తి చేసిన తరువాత వివిధ మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం కళాశాలల్లో చేరి నైపుణ్యాలు పెంచుకోవచ్చని సూచించారు. అయితే జర్నలిజం సవాళ్లతో కూడిన వృత్తి అనే విషయాన్ని గుర్తెరగాలన్నారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలు వికసించడానికి, ఆలోచనా ధృక్పథం విస్తరించడానికి జర్నలిజం కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కళాశాల అడ్మనిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిజం పునాది కలిగిన విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పారు.