మా సమస్యలు ఇవే: బాబు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్కు జర్నలిస్ట్ ఫిర్యాదు!
ఓ జర్నలిస్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తమ బాధలు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జర్నలిస్టుల హెల్త్ స్కీంల పైన ఆలస్యం చేస్తోందన్నారు.
అమరావతి: 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీకి ప్రత్యేక హోదా పైన వరుసగా బహిరంగ సభలు పెడుతున్నారు. అలాగే సమయం దొరికినప్పుడు ప్రజలను కలుస్తున్నారు. వారి బాధలను, ఆవేదనలను వింటున్నారు.
రాజధానికి భూములు ఇచ్చే వారి నుంచి మొదలు ఏలూరులో పరిశ్రమ ఏర్పాటు వరకు పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై ప్రభుత్వం కూడా దిగివచ్చింది. తాజాగా, ఆయన జర్నలిస్టుల బాధలను విన్నారు.
ఓ జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్తో తమ బాధలు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జర్నలిస్టుల హెల్త్ స్కీంల పైన ఆలస్యం చేస్తోందన్నారు. తమకు ఇచ్చిన హెల్త్ కార్డులు మెడికల్ బిల్ రీయింబర్సుమెంట్స్కు ఉపయోగించుకునేలా లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారి కోసం లక్షలాది ఇళ్లను కట్టిస్తున్నట్లుగా చెప్పిందన్నారు. ఏపీలో 13 జిల్లాల్లో 11వేల నుంచి 14వేల జర్నలిస్టులు మాత్రమే ఉన్నారని, వారికి ఏం చేసిందన్నారు. ఈ సందర్భంలో, అసలు ప్రభుత్వం స్పందన ఏమిటని సదరు జర్నలిస్టును పవన్ కళ్యాణ్ అడిగారు. దానికి ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వాయిదా వేస్తోందన్నారు. అడిగితే అయిపోయిందని మాత్రం చెబుతున్నారన్నారు.