జయలలిత తర్వాత శశికళ: 'ఏపీ-తెలంగాణలో ఇదే పరిస్థితి, తెలుగు రాష్ట్రాలకు గుణపాఠం'
జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం చూసిన తర్వాతనైనా తెలుగు రాష్ట్రాలు గుణపాఠం నేర్చుకోవాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
విశాఖ: జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం చూసిన తర్వాతనైనా తెలుగు రాష్ట్రాలు గుణపాఠం నేర్చుకోవాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్న నేతలు ఎవరికీ అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహంగా మార్చడం వల్ల జయలలిత మరణం అనంతరం శశికళనే దిక్కు అంటూ ప్రభుత్వం ఆమె కాళ్ల వద్ద మోకరిల్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోను ఉందన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ అన్నారు.
అప్పుడే దేశం సుభిక్షం
ప్రజలు బ్యాంకులలో చెల్లించిన సొమ్ముును తిరిగి చెల్లించే నోట్లను ముద్రించే స్థితిలో ప్రభుత్వం లేదా అని జేపీ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన నోట్ల రద్దుకు లోక్ సత్తా మద్దతు తెలుపుతోందన్నారు. తాము దాచుకున్న సొమ్మును పొందేందుకు సామాన్యులు లాఠీ దెబ్బలు తినాల్సి రావడం బాధాకరమన్నారు. ఇది అన్యాయమన్నారు.
దేశ ప్రజానీకం మొత్తాన్ని నోట్లు రద్దు కార్యక్రమం తాకిందన్నారు. దేశంలోని వెయ్యిమంది అవినీతి అధికారులను, రాష్ట్రంలో వంద మంది అవినీతి అధికారులను ఇంటికి పంపిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఏపీలోని ఓ విద్యార్థి కోసం ప్రభుత్వం రూ.44వేలు ఖర్చు చేస్తోందని, అయితే సామాన్యులు ఎందుకు ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారన్నారు.