జగన్ సర్కారుకు బీజేపీ మరో షాక్- అమరావతే రాజధాని అన్న నడ్డా- కేంద్రంతో విభేదిస్తూ
ఏపీలో మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మూడు రాజధానుల ఏర్పాటుతో రాజకీయంగా తమకు ప్రయోజనమా కాదా అన్న విషయంలో కాషాయ పార్టీకి ఓ స్పష్టమైన అభిప్రాయం లేకుండా పోతోంది. దీంతో కాసేపు అమరావతి అంటూ మరోసారి రాష్ట్ర్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తోంది.
హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లకు భిన్నంగా బీజేపీ అధినాయకత్వం తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమంటూ కేంద్రం అధికారికంగానే చెబుతుంటే అమరావతే రాజధాని అంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.
అమరావతిపై బీజేపీలో గందరగోళం..
టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించగానే బీజేపీ మద్దతిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోడీ వచ్చి శంఖుస్ధాపన చేసి వెళ్లారు. కానీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదు. తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే కేంద్రం దానికి మద్దతునిచ్చింది. హైకోర్టులో అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమంటూ అఫిడవిట్లు దాఖలు చేసింది. తిరిగి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు అమరావతే రాజధాని, ఇది బీజేపీ అభిప్రాయమంటూ మరో వాదన నెత్తికెత్తుకుంది. దీంతో అసలు బీజేపీ అమరావతికి అనుకూలమా, మూడు రాజధానులకా అనేది ఇప్పటికీ గందరగోళంగానే మిగిలిపోతోంది.
అమరావతిపై నడ్డా యూటర్న్ ?
ఏపీ రాజధాని అమరావతే. బీజేపీ జాతీయ నేతలే నాకు ఈ విషయాన్ని చెప్పారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతుంటే ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే అమరావతికి మద్దతుగా బీజేపీ చేసిందేమీ లేదు. కానీ తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీలో ఆయన అమరావతే రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలను పవన్ మరోసారి బయటపెట్టారు. బీజేపీ విధానం ఇదే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు. దీంతో అమరావతి విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వెళ్తోందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం సానుకూలమే అంటూ గతంలో బీజేపీ నేత జీవీఎల్ వంటి వారు అధికారికంగానే చెప్పారు. ఇదే బీజేపీ విధానం అని కూడా చెప్పారు. కానీ తాజాగా నడ్డా వ్యాఖ్యలు చూస్తుంటే యూటర్న్ తీసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం వైఖరికి భిన్నంగా బీజేపీ...
జాతీయ స్దాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ కీలక అంశాల విషయంలో మాత్రం అస్పష్టమైన విధానాలతో అభాసు పాలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించాక పలుమార్లు కోర్టులతో పాటు బహిరంగంగానూ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. కానీ బీజేపీ నేతలు మాత్రం క్ంద్ర, రాష్ట్ర స్దాయిల్లో అమరావతే రాజధాని అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో కేంద్రం వైఖరిని వీరు వ్యతిరేకిస్తున్నారా లేక వ్యూహాత్మకంగానే డబుల్ డేమ్ అడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని జేపీ నడ్డా నిన్న చెప్పిన మాటలు చూస్తే వారికి మద్దతుగా కోర్టుల్లో బీజేపీ పోరాటం చేయాల్సి ఉంది. కానీ కేంద్రం వైఖరికి భిన్నంగా బీజేపీ న్యాయపోరాటానికి సిద్దమవుతుందా అంటే సమాధానం లేదు. ప్రస్తుతం అమరావతి రాజధానిపై కోర్టుల్లో విచారణ జరుగుతున్న తరుణంలో రైతులకు మద్దతివ్వకుండా బీజేపీ చేసే న్యాయమేంటో ఎవరికీ తెలియడం లేదు.
పవన్ కోసమే బీజేపీ వ్యాఖ్యలు...
అమరావతి రాజధానిగా ఉండాలనే అంశంలో బీజేపీ కంటే మిత్రపక్షంగా ఉన్న జనసేన ఒత్తిడే ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి అమరావతి విషయంలో బీజేపీ ఏదో చేస్తుందన్న నమ్మకం అక్కడి రైతులకే కాదు ఎవరికీ లేదు. కానీ జనసేన ఒత్తిడితోనే అమరావతికి మద్దతుగా బీజేపీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. లేకపోతే కేంద్రం వైఖరికి భిన్నంగా పోరాడే పరిస్దితి లేనప్పుడు జనసేనాని పవన్తో సమావేశాల సందర్భంగా మాత్రమే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.