ఇది ఒక విశిష్ఠ బహుమతి: ఆంధ్రప్రదేశ్కు కేంద్రమంత్రి తీపి కబురు
గుంటూరు: మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ను గడువుకంటే ముందే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని, రాష్ట్ర ప్రజలకు ఇది ఒక విశిష్ఠ బహుమతిగా మిగులుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళగిరిలో ఎయిమ్స్నునెలకొల్పారని చెప్పారు.
రూ.1,618 కోట్లతో ఎయిమ్స్ను నిర్మిస్తామని తెలిపారు. త్వరలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామన్నారు. మెరుగైన ఫ్యాకల్టీని అందిస్తామని తెలిపారు. 2019లో జనవరి నాటికి ఔట్ పేషెంట్ బ్లాక్ సిద్ధం చేస్తామని తెలిపారు. అన్నింటిలోకి ఏపీ ఎయిమ్స్ పెద్ద ప్రాజెక్టు అన్నారు.
ఎయిమ్స్ తొలి దశ పూర్తి కావడానికి మార్చి వరకు గడువు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో జనవరికే సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శుభవార్త తెలిపారు. ఇప్పటికే అధ్యాపకుల నియామకం మొదలైందన్నారు. ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 185 ఎకరాల భూమిని అందించిందని, అన్ని అనుమతులు త్వరితగతిన అందించామని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వారు మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణ పనులు పరిశీలించారు.
డయాలసిస్ కేంద్రాలు
శ్రీకాకుళం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులపై త్వరలో కేంద్ర వైద్య బృందాలతో అధ్యయనం చేయనున్నామని జేపీ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి డయాలసిస్ యోజన కింద రాష్ట్రానికి 13 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం జిల్లాకు ఒకటి చొప్పున డయాలసిస్ కేంద్రం తప్పనిసరి చేస్తామన్నారు. ఆయన గుంటూరులో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కృష్ణంరాజులతో భేటీ అనంతరం మాట్లాడారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా సేవలు అందించడమే లక్ష్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం మంది, పట్టణాల్లో 60 శాతం మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని చెప్పారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ అమల్లో భాగంగా ఇప్పటికే 26 రాష్ట్రాలు వివిధ బీమా కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు.