26 రాజ్యాంగ దినం: 'రాష్ట్రాలకు సొంత రాజ్యాంగాలు ఉంటే మంచిది'
హైదరాబాద్: అమెరికాలో మాదిరిగా భారత దేశంలోనూ అన్ని రాష్ట్రాలకు సొంత రాజ్యాంగాలు ఉండటం మంచిది అని లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ చెప్పారు. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం ఆమోదించిన రోజు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గౌరవార్థం రెండు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించింది. రెండు రోజుల పాటు... గురువారం, శుక్రవారం పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం పైన మాట్లాడారు.
రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా గురువారం నాడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడారు. రాష్ట్రాలకు సొంత రాజ్యాంగాలు ఉండాల్సిన అవసరం పైన చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో రాష్ట్రాలకు సొంత రాజ్యాంగాలు ఉంటాయని, అలా మన దేశంలోను ఉండాలన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్యం ప్రధాన బలాలుగా దేశాన్ని నడిపించడంలో రాజ్యాంగానికి కీలక పాత్ర అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధఇకారాల విభజన యథాతథంగా కొనసాగిస్తూనే అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. సొంత రాజ్యాంగం ద్వారా కొత్త ఆలోచనలు అమలు చేసే శక్తి రాష్ట్రాలకు లభిస్తుందన్నారు.