జగన్కు బెయిల్ పొరపాటు కాదు, కానీ: జెపి, రోడ్ మ్యాప్
ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ మంజూరు పైన జెపి స్పందించారు. జగన్కు బెయిల్ ఇవ్వడం పొరపాటు కాదని, ఎల్లకాలం జైలులో ఉంచడం ద్వారా అవినీతిని రూపుమాపలేమని చెప్పారు. అయితే, అవినీతి నిరూపితమైన వారి ఆస్తులను జఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ కేసు తీవ్రత లాంటివే అవినీతి కేసులు అని అభిప్రాయపడ్డారు. అవినీతి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు.
జాతి చరిత్రలోనే చెప్పుకోదగ్గ కేసు జగన్ది అన్నారు. అవినీతి కేసుల్లో చాలా వరకు ప్రభుత్వాలే విచారణను అడ్డుకుంటున్నాయని బాహాటంగా అవినీతిపరులను కాపాడుతున్నాయని, జగన్ కేసు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అవినీతిపరులకు ఏళ్ల పాటు కఠినమైన శిక్షలు పడే చట్టాలు తీసుకు రావాల్సిన అవసరముందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ రాష్ట్రంలోనే కాదు క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగు వాళ్లు ప్రార్థనలు జరిపారు. రాష్ట్రం నుండి వెళ్లిన పలువురు అక్కడ ప్రార్థనలు చేశారు. సోమవారం బెయిల్ వచ్చిన విషయం తెలిసి మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.
మరోవైపు చంచల్గూడ జైలు వద్ద మంగళవారం మధ్యాహ్నం కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జగన్ విడుదల నేపథ్యంలో కార్యకర్తలు అక్కడకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన తనయుడి కోసం ఇష్టమైన ఆహార పదార్థాలు సిద్ధం చేశారట.
నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్
జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్ ఆస్తుల కేసు దర్యాఫ్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని కోరారు.
పూచికత్తు పరిశీలన పూర్తి
జగన్ బెయిల్కు సంబంధించిన పూచీకత్తును న్యాయమూర్తి పరిశీలించారు. బెయిల్ ఆర్డర్ను చంచల్ గూడ జైలు అధికారులకు పంపించనున్నారు.
జగన్ రోడ్ మ్యాప్
జగన్ చంచల్గూడ జైలు నుండి విడుదలయిన అనంతరం మొజంజాహీ మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్కీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డక్కన్, నాగార్జున సర్కిల్, కెబిఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఫిలిం నగర్ల మీదుగా లోటస్ పాండుకు చేరుకుంటారు.