ఓటుకు నోటుపై చంద్రబాబుపై ప్రశ్నలు సంధించిన జెపి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో లోకసత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం ఆయన చంద్రబాబుకు ఆ ప్రశ్నలు వేశారు.
"మీ ఎమెల్యే 5 కోట్ల రూపాయలు ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా, ఒక వేళ అలా చేస్తే మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా, ఒక వేళ రేవంత్ రెడ్డి సొంతంగా వ్యవహారం చేస్తే మీరు ఇంత వరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు?" అంటూ జెపి చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణల ఆడియో రికార్డుపై కూడా చంద్రబాబును జెపి ప్రశ్నించారు. "ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడింగ్ లేదని తేలితే మీరు రాజీనామా చేస్తారా?"అని ఆయన చంద్రబాబును అడిగారు.
స్టీఫెన్సన్కు కరెన్సీ నోట్లను ఇస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో రికార్డు న్యూస్ చానెళ్లలో ప్రసారమైంది. అదే విధంగా స్టీఫెన్సన్తో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో రికార్డు సంభాషణలు కూడా న్యూస్ చానెళ్లలో వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జెపి ఆ ప్రశ్నలు సంధించారు.