డిపాజిట్ దక్కని జెపి, జాతీయ అధ్యక్ష పదవికి రిజైన్
హైదరాబాద్: మల్కాజిగిరి బరి నుండి దిగిన లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఘోర పరాజయం పాలయ్యారు. ప్రముఖులు పోటీలో నిలిచిన దేశంలో అతిపెద్ద లోకసభ స్థానం మల్కాజిగిరిలో ఎన్నిక పోటా పోటీగా జరిగింది. ఇక్కడ పోటీ కేవలం టిడిపి, తెరాసల మధ్యే పోటీ కనిపించింది.
ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రముఖులంతా ధరావతు కోల్పోయారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితిని. అయితే చివరి దాకా టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి, తెరాస అభ్యర్థి మైనంపల్లి హన్మంత రావుల మధ్య విజయం దోబోచూలాడింది. చివరకు మల్లారెడ్డినే విజయం వరించింది.
ఇక్కడ జయ ప్రకాశ్నారాయణ పోటీ చేసినా అది కేవలం టిడిపి ఓట్లను చీల్చింది కానీ టిడిపి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. టిడిపి గెలిచినా క్రాస్ ఓటింగ్ జరగడంతో అసెంబ్లీ అభ్యర్థుల కన్నా కూడా 47,248 ఓట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, జయప్రకాష్ నారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి, మజ్లిస్ అభ్యర్థి సుధాకర్, స్వతంత్రంగా పోటీ చేసిన ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఎఎపి నుంచి పోటీ చేసిన సుధాకిరణ్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
వారు డిపాజిట్ చేసిన రూ.25 వేల మొత్తాన్ని ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. డిపాజిట్ దక్కించుకోవాలంటే పోలైన ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది. మరో విషయమేమంటే జెపి గతంలో పోటీ చేసి గెలుపొందిన కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఆయనకు ఎక్కువగా ఓట్లు పడలేదు. టిడిపి అభ్యర్థికి పడ్డాయి.
జెపి రాజీనామా
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జెపి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తెలంగాణష ఆంధ్రప్రదేశ్ రెండుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వచ్చే వారం జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమాశంలో దీనిని ఆమోదించాల్సి ఉంది.