తప్పుకున్న జెపి: మరింత ముదిరిన లోకసత్తా వివాదం
హైదరాబాద్ : లోక్సత్తా పార్టీ అధ్యక్ష పదవి నుంచి మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ తప్పుకున్నారు. కొత్త నాయకత్వం రావాలనే పదవి నుంచి తప్పుకున్నానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో కొత్త తరాన్ని తీసుకురావాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు తెచ్చి సంఘర్షణ వాతావరణం సృష్టించారని అన్నారు.
లోక్సత్తా అధ్యక్ష పదవి నుంచి జయప్రకాశ్ నారాయణ తప్పుకున్న నేపథ్యంలో లోక్సత్తా ఏపీ శాఖకు కొత్త అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. అధ్యక్షుడిగా డాక్టర్ పట్టాభిరామయ్య, ప్రధాన కార్యదర్శిగా బీశెట్టి బాబ్జీ నియామకం అయ్యారు. ఈ మేరకు లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ అధికారికంగా ప్రకటించారు.
గత్యంతరం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీనివాస్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త కార్యవర్గం పని చేస్తుందన్నారు. లోకసత్తాలో ఇటీవల అంతర్గత తగాదాలు ముదిరి వీధికెక్కిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి కటారి శ్రీనివాస్తో పాటు ఏపీ అధ్యక్షుడు వర్మ, ప్రధాన కార్యదర్శి రమేష్రెడ్డిని బహిష్కరించారు. జయప్రకాష్ నారాయణకు చెందిన వర్గాన్ని పక్కన పెడుతున్నారనే విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాత్సవ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలోని పలువురు పార్టీ నేతలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, శ్రీవాస్తవపై కటారి శ్రీనివాస రావు, వర్మ తీవ్రంగా ధ్వజమెత్తారు.
లోకసత్తా బహిష్కరణ వివాదం మరింతగా ముదిరింది. లోకసత్తా నూతన జాతీయ కమిటీని డివివిఎన్, కటారి శ్రీనివాస రావులు ప్రకటించారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ, కటారి మాట్లాడారు. కొత్త జాతీయ అధ్యక్షుడిగా కటారి శ్రీనివాస రావు పేరును వర్మ ప్రకటించారు. సురేంద్ర శ్రీవాస్తవకు పార్టీతో సంబంధం లేదని, అందువల్ల కమిటీ వేసే హక్కు లేదని వర్మ, కటారీ అన్నారు. డివివిఎన్, కటారీ శ్రీనివాసరావులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో వివాదం ప్రారంభమైంది.