ఛాన్స్ మిస్!: తగ్గిన జూఎన్టీఆర్, చంద్రబాబును కలిశారు
హైదరాబాద్: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తగ్గారు! ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు మరో హీరో కళ్యాణ్ రామ్ టిడిపి అధినేతనుకలిశారు.
కొన్నాళ్లుగా చంద్రబాబు పట్ల జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే బాబు గెలుపుతో వారు కలిశారు. శనివారం హరికృష్ణ టిడిపి అధినేతను కలవగా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంలు ఆదివారం కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు చంద్రబాబును విమర్శించేందుకు ఛాన్స్ వస్తుందని పలువురు భావించారు. కానీ టిడిపి గెలుపుతో కుదరలేదు.
చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం ఉంది. పార్టీ గెలుపుపై కార్యకర్తలు, నేతలు ఆనందంలో ఉన్నారు. దీంతో బాబు ఇంటికి పలువురు క్యూ కడుతున్నారు. పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు బాబును కలిశారు. హీరో నాగార్జున పుష్పగుచ్ఛం ఇచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
సీమాంధ్రలో టిడిపి విజయం సాధించడంతో చంద్రబాబుపై అభినందనల వర్షం కురుస్తోంది. సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి చంద్రబాబును కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.