సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, అన్ని గ్రామ సచివాలయాల రంగును కూడా మార్చేస్తున్నారు. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగును పోలివుండటం విమర్శలకు తావిచ్చింది కూడా.
గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!
అప్పుడు పసుపు.. ఇప్పుడు వైసీపీ..
ఇప్పటికే గ్రామ సచివాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పూయడమేంటంటూ ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో పచ్చ రంగు పూస్తే మీరు మీ పార్టీ రంగును పూస్తున్నారా? మీకు ఆయనకు ఇక తేడా ఏంటీ? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రంగులు, ఫొటోలు..
ఇక పార్టీ రంగులు గ్రామ సచివాలయాలకు వేయడమేంటి? అని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిలదీస్తున్నారు. ఈ కొత్త గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడంతోపాటు సీఎం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.
టీడీపీ అత్స్యుత్సాహం..
ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు విమర్శలతోపాటు ఆగకుండా అత్య్సుత్సాహాన్ని ప్రదర్శించారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడులో ఉన్న గ్రామ సచివాలయానికి ప్రభుత్వం వేసిన రంగును తొలగించి, పసుపు రంగు వేశారు.
సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్..
అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో స్థానంలో ప్రముఖ సినీ హీరో, టీడీపీ వ్యవస్థాకుడైన నందమూరి తారక రామారావు మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ను అంటించారు. ఇది గమనించిన అధికార వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
కేసులు నమోదు..
కాగా, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి పసుపు రంగేసిన ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.