మావయ్య పిలిచారు, గర్వంగా...: నవ్వుతూ జూ ఎన్టీఆర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిందన్నారు.
కౌత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం... అదీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందటం గర్వంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి మామయ్య తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. తాను కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని తిలకించబోతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆనందంగా విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం టిడిపి శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదుట మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీంతో ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అటు గుంటూరు నగరం వరకు 30 కిలోమీటర్ల మేర రహదారి అంతా పసుపు మయమైపోయింది.
టిడిపి జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భారీ కటౌట్లు, స్వాగత ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. రాత్రి 7.27గంటలకు కార్యక్రమం ఉండడంతో పెద్ద ఎత్తున లైటింగ్ను అమర్చారు.
నేడు చంద్రబాబు ప్రమాణం
కాగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం రాత్రి 7.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా గతంలో యువగర్జన సభ నిర్వహించిన స్థలంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఈ ప్రమాణస్వీకార వేడుక జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మంది తరలివస్తారని భావిస్తున్నారు.