చంద్రబాబు తప్పిదమా: జోష్లో ఎన్టీఆర్, టిడిపిలో జై లవకుశ గుబులు
వరుస విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకుపోతున్నారు. ఆయన సక్సెస్ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడడం లేదు. పైగా టిడిపి శ్రేణులు కలవరం చెందుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తాను ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెబుతూ వచ్చినా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లేదు.
జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా ఉంచాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన తనయుడు నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ను ఆయన దూరం పెట్టినట్లు భావిస్తున్నారు. నారా లోకేష్ను పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి వరకు ప్రమోట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ పగ్గాలను పూర్తిగా లోకేష్ చేతిలో పెట్టాల్సిన అవసరం ఆయనకు ఉంది. దీనివల్లనే జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. అయినా కూడా ఎన్టీఆర్ ఏ విధమైన వివాదాల్లోకి కూడా వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
జై లవకుశ జోష్
కొన్ని వైఫల్యాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటూ వస్తున్న ఆయనకు తాజాగా జై లవకుశ పెద్ద జోష్నే ఇచ్చింది. జై లవకుశ టీజర్ రికార్డు స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరుస విజయాలు ఇలా....
నాన్నకు ప్రేమతో..., జనతా గ్యారేజ్ విజయాలు సాధించడం వల్ల ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు జై లవకుశ ఆయనకు కొత్త ఊపునిస్తుందని అంటున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ ఆయనకు ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జాగ్రత్తగా అడుగులు వేస్తూ వరుస విజయాలతో సినిమా రంగంలో దూసుకుపోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ కూడా....
బిగ్ బాస్ లాంచింగ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్పై కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందించారు. అయితే, ఎక్కడ కూడా మాట జారలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వివాదాలకు తావు ఇవ్వని రీతిలో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో వివాదానికి దిగకూడదనే సంయమనాన్ని ఆయన పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలకృష్ణనే జూనియర్ ఎన్టీఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసులో చేరినప్పటి నుంచి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్పై తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు.
టార్గెట్ అదే...
రాజకీయాల్లోకి రాబోనని జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజు కూడా చెప్పలేదు. వాటి గురించి మాట్లాడే అనుభవం లేదని మాత్రమే ఓ సందర్భంలో అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని అందుకోవడం అంత సులభమైన విషయం కాదని మాత్రమే అన్నారు తప్ప తనకు దానిపై ఆశలు లేవని స్పష్టంగా చెప్పలేదు. ఆయన 2024 ఎన్నకలను దృష్టిలో పెట్టుకుని పని చేసుకుంటూ పోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈలోగా సినీ రంగంలో తాతగారిలా ఇమేజ్ సంపాదించుకోవాలని ఆయనకు ఉండి ఉండవచ్చు.
చంద్రబాబు తప్పు చేశారా...
జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేసుకోవడమనేది చంద్రబాబు చేసిన తప్పుగానే భావిస్తున్నారు. నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక పాత్రను కూడా ఆశిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమీపిస్తుండడం, 2019 ఎన్నికలకు ముంచుకొస్తుండడం చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర టిడిపిలో క్రియాశీలకంగా లేకపోవడం చంద్రబాబుకు నష్టం చేస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. నష్టం చేయకున్నా, అదనంగా చేకూరే ప్రయోజనాన్ని చంద్రబాబు వదులుకుంటున్నారా అనేది ప్రధానమైన సందేహం.
నందమూరి అభిమానులు ఇలా....
నందమూరి అభిమానులు చాలా కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైంది. బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య తగాదాను వారు ఏ మాత్రం ఇష్టపడరు. బాలకృష్ణపై ఎక్కువ అభిమానం ఉంటే ఉండవచ్చు గానీ జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టడానికి ఇష్టపడరు. ఈ ఇద్దరి కలయిక తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు దూరం చేసుకోవడం పెద్ద తప్పిదమేనని అంటున్నారు.