జూ.ఎన్టీఆర్ జూలు విధించాల్సిన టైం వచ్చింది.!పార్టీని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్ దే అంటున్న శ్రేణులు.
2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్షరాలా 23 సీట్లు గెలుచుకుంది. వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా అదే 23 కావడం యాదృచ్ఛికం. జన్మభూమి కమిటీల అవినీతితోనే తెలుగుదేశం పార్టీ పరాజయానికి పునాది పడింది. మూడేళ్ల పాటు ప్రతి పల్లెలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తెదేపా నేతలు వసూళ్ల పర్వం చివరకు పార్టీని దెబ్బతీశాయి. ఉత్తరాంధ్రలోనే బాక్సైట్ తవ్వకాల నుంచి గుంటూరు జిల్లా పల్నాడులో గ్రానైట్ గనుల మింగటం వరకూ తెలుగుదేశం నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీని ప్రజలు ఉప్పు పాతరేసారు. మళ్లీ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువనేత రంగప్రవేశం చేయాల్సిందేననే చర్చ జరుగుతోంది.
అంతర్మథనంలో టీడిపి..! పార్టీని నడిపేదెవరనే అంశం పై చర్చ..!!
ఇసుక క్వారీల నుంచి కోట్లాదిరూపాయలు సంపాదించిన పసుపు తమ్ముళ్లు మరింతగా బరితెగించారు. చింతమనేని వంటి నేత వనజాక్షి అనే మహిళా తహసీల్దార్ను జుట్టుపట్టుకుని కొడితే చంద్రబాబు కనీసం నోరు మెదపలేకపోయారు. యరపతినేని గ్రానైట్ తవ్వుకుని అడ్డం వచ్చిన వైసీపీ నేతలను హత్య చేయిస్తే నోరెత్తలేకపోయారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమాలు రవాణాశాఖ కమీషనర్పై గొడవకు దిగితే బాబు నుంచి స్పందన కరవైంది. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఐదేళ్లలో వందరెట్లు సంపాదించాలనే తాపత్రయంతో బరితెగించారు. కొండలు, కోనలు, చెరువులు, నదులు దేన్నీ వదలకుండా మింగేశారు. ఎమ్మెల్యేగా రోజాను సభకు ఆహ్వానించి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద ఘోరంగా అవమానించారు. నదుల అనుసంధానమంటూ నానా హడావుడి చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి.
చర్చ మొదలైంది..! జూనియర్ పేరు వినబడుతోంది...!!
30 వేల ఎకరాలు రాజధాని పేరిట సేకరించి రైతులను బెదిరించటం, రాజధాని నగరం నిర్మాణం పేరిట చైనా, సింగపూర్, మలేషియా, జపాన్ అంటూ విదేశాలు చుట్టొచ్చిన చంద్రబాబు చివరకు గ్రాఫిక్స్తో సరిపెట్టారనే అపవాదును మూటగట్టుకున్నారు. వీటన్నింటి సంగతి ఎలా ఉన్నా తనయుడు లోకేశ్బాబుకు రాజకీయపగ్గాలు అప్పగించటం తప్పని సీనియర్ నేతలు అనుమానం వ్యక్తం చేసినా బాబు ఎదుట చెప్పలేకపోయారు. చినబాబు చుట్టూ చేరిన కోటరీ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తి శూరుడు, వీడుడుగా అభివర్ణించారు. స్వయంగా చంద్రబాబునాయుడు 44 శాతం మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పారు. 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ జేసీ దివాకర్రెడ్డి వంటి సీనియర్లు చెప్పిన మాటను పెడచెవిన పెట్టారు.
పథకాలన్నీ అట్టర్ ఫ్లాప్..! పక్కన ఉన్న వారే బాబు కొంప ముంచారు..!!
ఇవన్నీ అధిగమించేందుకు.. అన్నదాతాసుఖీభవం, పసుపు-కుంకుమతో రైతులు, మహిళలను ఆకట్టుకోవాలనే భేషైన పథకం.. బెడసికొడుతుందని ఊహించలేకపోయారు. జనసేన చీల్చే ఓట్లు వైసీపీవిగా భ్రమపడ్డారు. చివరకు తమ ఓట్లనే చీల్చటంతో ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటాలని ఆశపడిన చంద్రన్న ఆశ.. ఆశగానే మిగిలేలా తెలుగు తమ్ముళ్లు తమ వంతు సహకరించారు. ఇప్పుడు మిగిలింది.. పార్టీ భవితవ్యం. వైసీపీ నేతలపై టీడీపీ చూపిన కక్షపూరిత చర్యలకు తగు సమాధానం చెబుతామంటూ వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగానే ప్రభుత్వ వ్యవస్థలను నడుచుకుంటాయి. ఇటువంటి వేళ టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది సైకిల్ పైనే ఉంటారనేది కూడా అనుమానమే.
జూనియర్ పైనే నమ్మకం..! పార్టీ నడిపే సత్తా ఉంది సింహాద్రికే..!!
లోకేష్ నాయకత్వంపై నమ్మకం కొరవడింది. బాలయ్యబాబు.. పేరుకే సింహం తప్ప.. ఆచరణలో నాయకత్వ పటిమ లేదనేది బాలయ్య మాటల్లోనే తెలుస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి పార్టీని నడిపించేందుకు కనీసం.. మనుగడలో ఉంచేందుకు మళ్లీ ఏ జూనియర్ ఎన్టీఆరో, నారా బ్రాహ్మణియో నడుం బిగించాల్సిందేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులు బాబు వద్దకు తీసుకెళ్లాయట. మరి దీన్ని జూనియర్ ఎంత వరకూ ఆమోదిస్తాడనేది ప్రశ్నార్ధకమే. మొన్నీమధ్యే జూనియర్ మామ నార్నే వైసీపీ పార్టీలోకి చేరాడు. ఇప్పుడు అల్లుడు టీడీపీ పగ్గాలు చేపట్టి.. కుటుంబ బంధాలను దూరంగా ఉంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.