నిజమవుతున్న అభిమానుల ఆశలు: కలవనున్న బాలకృష్ణ-జూ.ఎన్టీఆర్
అమరావతి: చాన్నాళ్ల తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ, నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదిక పైన కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందనే వాదనలు ఉన్నాయి. దానికి తోడు ఇద్దరు ఒకే వేదికపై కనిపించలేదు.
కానీ, బాబాయ్ - అబ్బాయ్లు చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించి అభిమానులలో సంతోషం నింపనున్నారు. వీరిద్దరు ఒకేచోట కలవాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్నారు. ఇన్నాళ్లకు వారి కల నెరవేరనుంది. ఈ కలయికకు సినిమా కార్యక్రమం వేదిక కానుంది.
వీరిద్దరు ముఖ్య అతిథులుగా
జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత ఇటీవల ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్లు ముఖ్య అతిథులుగా రానున్నారు.
అభిమానుల ఆనందం
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు ఒకే వేదికపై కనిపిస్తారని తెలియగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. గతంలో సింహా సినిమా వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అరవింద సమేత విజయోత్సవానికి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
సినిమాలో కలిసి నటిస్తున్న బాలయ్య, కళ్యాణ్
ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా వస్తున్న బాలకృష్ణ, కళ్యాణ్ రామ్లు ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీస్తున్న ఎన్టీఆర్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తున్నారు.