తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను చూసిన జూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనూ ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులు ఆవేదనలో ఉన్నారు. తారకరత్నను టీడీపీ అధినేత చంద్రబాబు..పురంధేశ్వరి పరామర్శించారు. వైద్యులతో చర్చలు చేసారు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు కళ్యాణ రాంతో కలిసి తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. వారితో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివన్న కూడా కలిసి ఆస్పత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్న ఐసీయూ లో పరామర్శించారు. తారకరత్నను చూడగానే జూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారు.
జూ ఎన్టీఆర్ - కల్యాణ రాం ఎమోషనల్..
ఆస్పత్రిలో తారకరత్న ను చూడగానే జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, కల్యాణ రాం తో పాటుగా కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, కర్ణాటక ఆరోగ్య మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి.. వారి కుమార్తెలను జూ ఎన్టీఆర్ పరామర్శించారు.
వైద్యులతో చర్చించి అందుతున్న వైద్యం గురించి ఆరా తీసారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఆందోళనలతో కనిపించారు. అదే సమయంలో నారా బ్రాహ్మణి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తారకరత్న సతీమణితో మాట్లాడారు. వైద్యుల నుంచి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని..తమ ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు వివరించారు.
దెబ్బ తీసిన ప్రాణాంతక వ్యాధి..
తారకరత్న కు అరుదైన వ్యాధి మెలెనా ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్సలో భాగంగా తారకరత్నకు ఈ ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా రక్త స్రావం జరిగి అవయవాల మీద ప్రభావం పడుతుంది. శరీరంలోని అనేక భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక వైద్య పద్దతుల ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం కష్టంగా మారడమ్ తో ఎక్మో ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా తారకరత్న కు బ్లడ్ పంపింగ్ చేస్తూ చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
నిరంతరం వైద్య నిపుణుల టీం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. చంద్రబాబు - బాలయ్య ఆస్పత్రి వైద్యులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. ఇప్పుడు తారక్ కూడా చికిత్స అందిస్తున్న వైద్యుల గురించి తారకరత్న హెల్త్ కండీషన్ గురించి ఆరా తీసారు.
ఆస్పత్రిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి
జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్నకు అందుతున్న వైద్య సేవల గురించి సమీక్షించారు. ఆస్పత్రి వద్దకు తారక్ చేరుకొనే సమయానికే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరారు. తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యులు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రి సుధాకర్ కు వివరించారు.
తారక రత్న హెల్త్ కండీషన్ కు సంబంధించి మంత్రి స్పందించే అవకాశం కనిపిస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతుండటంతో.. నందమూరి కుటుంబ సభ్యులు ఆందోళన కలిగిస్తోంది.