అంతర్వేది ఘటనపై జనసేన దీక్షలు- హైదరాబాద్లో పవన్- ఏపీలో జనసేన నేతలు..
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ధర్మ పరిరక్షణ దీక్షలు చేపట్టారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి.
ధర్మ పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో పవన్ ఇవాళ దీక్షకు దిగారు. ఇంట్లోనే ఉన్న ఫామ్ హౌస్లో ఆయన దీక్ష చేపట్టారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాయి.
Recommended Video
అంతర్వేది రథం ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని నేతలు విమర్శించారు. దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ దీక్షలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.