నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!
ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం..ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాద నలు వినిపించారు. ఈ కేసులో వైసిపి తరపు న్యాయవాది ఇంప్లీడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు పై ఆసక్తి నెలకొని ఉంది.
బలంగా వాదనలు..
ఏపి ప్రభుత్వంలో పని చేస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీల బదిలీలపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఉత్తర్వులను సమర్థిస్తూ సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీఐకి లేదని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. మరోవైపు తామిచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నందున వ్యాజ్యంలో తమ వాదనలు వినాలని వైకాపా నేత విజయసాయిరెడ్డి అనుబంధ పిటీషన్ వేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వారి వాదనలను ఆలకించిం ది. ఎన్నికల విధులు అప్పగించిన పోలీసు అధికారుల జాబితాను ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి అంద జేశారు. జాబితాలో ఇంటెలిజెన్స్ డీజీ లేరని తెలిపారు. దీని పైనా వాదనలు సాగాయి.
కారణాలు తెలపుకుండానే..
ఎన్నికల సంఘం తమ ఉత్తర్వుల్లో బదిలీ కారణాలను తెలుపలేదు. బదిలీ అయినవారి స్థానంలో నియమించేందుకు మూడు ప్యానల్ పేర్లను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడమే. ఎస్పీలు ఇద్ద రు డిజిగ్నేటెడ్ అధికారులైనందున వారి విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐకి ఉండొచ్చు. డీజీ వ్యవహా రంలో జోక్యానికి వీల్లేదని ఏపి ప్రభుత్వం తరపున ఏజి వాదనలు కొనసాగించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులపై ఈసీఐ జోక్యం తగదని .. డీజీ బదిలీ విషయంలో ఈసీఐ ఉత్తర్వులను నిలిపేయండని అభ్యర్దించారు. ఈ వ్యాజ్యంలో మూడో పార్టీ గా..వైకాపా జోక్యానికి వీల్లేదు అని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి తరఫున సీనియర్ న్యాయ వాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీఐ బదిలీ చర్యలు తీసుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యంలో జోక్యం చేసుకునే అర్హత తమకుందని తెలిపారు.
ఎన్నికల సంఘ ఉత్తర్వులు డోన్ట్ కేర్ : నిఘా బాస్ ను రిలీవ్ చేయకుండానే : జీవోలతో యుద్దం..!
ఈసీకి అధికారం ఉంది..
ఈసీఐ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీఐకి ఉంది. బదిలీ చేసిన అధికారుల స్థానంలో ఇతరులను నియమించేందుకు అధికారుల ప్యానల్ జాబితా పంపాలని కోరడం రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకున్నట్లు కాదు. బదిలీకి కారణాలను వెల్లడిస్తే అధికారులకు ఇబ్బంది కలుగుతుంది. మచ్చలా మిగులుతుంది. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నా రు. అధికారులను బదిలీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రభావితమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం వేయడం ఆశ్చర్యపరుస్తోందన్నారు. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసి ఇంటెలిజెన్స్ డీజీని ప్రభుత్వం అదే పోస్టులో ఎలా కొనసాగిస్తుందని నిలదీసారు.తాజాగా జాబితాను సిద్ధం చేసి ఎన్నికల విధుల్లో డీజీ వెంకటేశ్వరరావు లేరని ప్రభుత్వం జీవో ఇచ్చింది.. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ విభాగానిది కీలకపాత్ర.ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదనడం సరికాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయాలని ప్రకాశ్ రెడ్డి కోరారు.