జడ్జి లోయాను చంపేశారు .. అమిత్ షా ప్రమేయం ఉంది: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సీపీఐ నేత నారాయణ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసు విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయా మృతి కేసులో అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.
అమరావతి: సీపీఐ నేత నారాయణ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులోవాదనలు వింటున్నసీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి లోయా మృతి కేసులో అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.
శనివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో సంక్షోభం మొదలైందన్నారు. జడ్జి లోయాను చంపేశారని, కల్కాపూర్ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, వేల కోట్ల రూపాయల మెడికల్ కుంభకోణం జరిగితే, జడ్జిలను మార్చి కేసులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు గురించి నారాయణ ప్రస్తావిస్తూ, నిర్వాసితుల పునరావాసానికి రూ.32 వేల కోట్లు కావాలని, పునరావాస నిధులపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదని, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో లేదని విమర్శించారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తానని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.