ఏపీలో పని మొదలు పెట్టిన జ్యుడీషియల్ ప్రివ్యూ :మొదట ఆ శాఖలోనే
ఏపీలో పారదర్శక పాలన దిశగా నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా వంద కోట్ల రూపాయలు దాటిన ఏ టెండర్ అయినా,పని అయినా జ్యుడీషియల్ ప్రివ్యూ కి పంపిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు ఏకీభవించారు. పెద్ద పెద్ద టెండర్ల విషయంలో చోటుచేసుకునే అవినీతికి చెక్ పెట్టినట్టు అవుతుందని పేర్కొన్నారు.
ఎక్కడైనా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేది ఇలాంటి పెద్దపెద్ద టెండర్లలోనే అని భావించిన ఏపీ సీఎం జగన్ అందుకు చెక్ పెట్టటానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎక్కడ అవినీతికి తావులేకుండా,ప్రతి ఒక్క పని పారదర్శకంగా,ప్రజల అందరికీ అర్థమయ్యేలా చేసే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంలో తొలి అడుగు పడింది. మొదటి టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
వైద్య శాఖలో 104 మరియు 108 అంబులెన్స్ ల నిర్వహణ కోసం సర్వీసు ప్రొవైడర్ల నుండి టెండర్లను ఆహ్వానించింది వైసిపి ప్రభుత్వం.ఇక ఈ టెండర్ల విషయంలో వైద్య శాఖను జ్యుడీషియల్ ప్రివ్యూ కోసం సంబంధిత డాక్యుమెంట్లను అందించాల్సిందిగా కోరింది. అంతే కాకుండా సంబంధిత వివరాలు తీసుకోవాల్సి కూడా ఉంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు మరొక 700కుపైగా అంబులెన్స్ లను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరువందలకు పైగా అంబులెన్సులు సర్వీసులను అందిస్తున్నాయి.
ఇక అంబులెన్సుల నిర్వహణ వ్యయం వంద కోట్లకు పైగా దాటుతుండగా జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపించారు.ప్రస్తుతం ఏపీలో మొట్టమొదటి టెండర్ అయిన వైద్య శాఖ లోని అంబులెన్స్ నిర్వహణపై జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియ మొదలైంది. ఈ నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అంబులెన్సు నిర్వహణకు నెలకు సుమారు 1,35000 ఖర్చవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మొత్తం 700కుపైగా అంబులెన్సుల నిర్వహణ వ్యయంపై జ్యుడీషియల్ ప్రివ్యూ చేస్తున్నారు.