వందమంది ఉన్నా: జూలకంటి, ఏం చెప్తారో చూస్తా: కిరణ్
ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... మీరు ఒక్కరే ఉన్నారని, మీ సిద్ధాంతం మీకుంది కాబట్టి అభ్యంతరం లేదని, తెలంగాణ ప్రాంతానికి తాము ఏం అభివృద్ధి చేశామో చెబుతామన్నారు. మీ సిద్ధాంతం మీకున్నందుకు అభినందనలు అన్నారు. మీ సిద్ధాంతం మారలేదు కాబట్టి ఇబ్బంది లేదని కానీ, ప్రజలు పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. తాము చేసిన అభివృద్ధి చెబుతామన్నారు. పార్టీలను బట్టి ప్రజలు ఆలోచించడం లేదని, ప్రాంతాల వారీగా ఆలోచిస్తున్నారన్నారు. ఏం చేశామో చెబుతామని, ఆ తర్వాత మీరేం చెబుతారో చెప్పండన్నారు.
తాను జూలకంటి స్పందిస్తూ.. తాను ఒక్కడిని ఉన్నా కమ్యూనిస్టులు.. కమ్యూనిస్టులేనని, మీరు వందమంది ఉన్నా ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. కమ్యూనిస్టులను వ్యంగ్యంగా విమర్శిస్తే ఆ తర్వాత మీరే బాధపడతారన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా తాము బలయ్యామన్నారు.
తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒకటి చెబితే రాష్ట్ర నేతలు మరొకటి చెబుతున్నారన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలన్నారు. పాలకుల నిర్లక్షఅయం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. తెలంగాణపై మాట మార్చడం సరికాదన్నారు. తెలంగాణ వంటి ముఖ్య సమస్యను నాన్చడం సరికాదన్నారు.
వేల మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం చూడాలన్నారు. కొందరు నేతలు ఓట్ల కోసమే ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. ప్రాజెక్టులకు నిధులు ఎలా కేటాయిస్తారో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్నారు. ఆందోళన కారణంగా రాష్ట్రం పరువు పోయిందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.
పాలకుల బుద్దిని బట్టి రాష్ట్రాల అభివృద్ధి ఉంటుందన్నారు. పాలకుల స్వలాభాపేక్ష వల్లే సమస్యలన్నారు. అఖిల పక్షాల భేటీకి పార్టీల అధ్యక్షులు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలన్నారు. ఉద్యమాలతో రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. రాష్ట్రాలు చిన్నవా.. పెద్దవా అని కాకుండా, సమస్యకు త్వరగా పరిష్కారం చూపించాలన్నారు. నాయకుల అవకాశవాదం వల్ల సమస్య జఠిలమైందన్నారు. ప్రధానిది విభజనవాదమైతే, ముఖ్యమంత్రిది సమైక్యవాదంగా ఉందన్నారు. ఒకే పార్టీలో రెండు విధానాలు వద్దన్నారు.