తెలంగాణ నుంచి వచ్చేవారికి ఏపీ డెడ్లైన్: జూన్ 2, 2017లోపు వస్తే స్థానికత
విజయవాడ: తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలు, ఉద్యోగుల స్థానికత పైన వస్తున్న ప్రశ్నలకు గురువారం నాడు ఏపీ కేబినెట్ స్పష్టతను ఇచ్చింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తిరిగి వచ్చే వారికందరికి ఏపీ స్థానికత వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాష్ట్ర మంత్రివర్గం గురువారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటున్న వారి స్థానికత అంశంపై స్పష్టతను ఇచ్చింది. ఇసుక విధానంపై లోతైన చర్చ జరిపింది.
ప్రస్తుత ఇసుక విధానాన్ని సమీక్షించి, లోపాలు తొలగించి తక్కువ ధరతో, సకాలంలో ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఓ సమగ్ర విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగింది.
సమావేశంలో నిర్ణయాలను మంత్రులు పల్లె రఘునాథరె డ్డి, పీ నారాయణ, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవ రావు విలేకరులకు తెలిపారు. ఏపీకి చెంది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులు, ఇతరులు 2017 జూన్ 2వ తేదీలోగా ఇక్కడికి తరలివస్తేనే స్థానికతను కల్పిస్తారు.
స్థానికత విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసినట్లు చెప్పారు. ఏపీకి తరలివచ్చే వారికి విద్య, ఉద్యోగావకాశాల్లో స్థానికతను కల్పిస్తామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరంలేదని భావిస్తున్నామన్నారు.
అమరావతి రాజధానికి ఈ నెల 22వ తేదీన దసరా రోజు మధ్యాహ్నం 12.35 - 12.45 గంటల మధ్య శంకుస్థాపన చేస్తారు. ఉద్దండరాయునిపాలెం నుంచి కృష్ణా నది ఒడ్డు వరకు 50 కిలోమీటర్ల మేర ప్రాంతంలో కోర్ క్యాపిటల్ ఏర్పాటు జరిగే అవకాశముంది.
అనంతపురం వంటి కరవు జిల్లాల్లో ఇన్ఫుట్స్ సబ్సిడీకి బదులు వేసుకున్న పంటను కాపాడేందుకు వీలుగా రెయిన్ గన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందుకు 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తామని, సీమలో 25 హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్లపై 50 శాతం, 45 నుంచి 65 హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్లపై 25% రాయితీ ఇస్తామన్నారు.
తూర్పు కోస్తా తీరాన్ని లాజిస్టిక్ హాబ్గా తీర్చిదిద్ది కార్గో పెంచేందుకు షిప్పింగ్ వ్యాపార లావాదేవీలను పెంపొందింపజేసేందుకు, అంతర్జాతీయ నౌకల కార్యకలాపాలపై విధించే వ్యాట్ను 22.5 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దేశీయ నౌకల లావాదేవీలపైనా 22.5 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు.