జూన్ 2 చీకటి రోజు, వేడుకెలా చేసుకుంటాం? అవమానం: మోడీని ఏకేసిన చంద్రబాబు
Recommended Video
అమరావతి: జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏపీకి తీరని ద్రోహం చేశామని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ వేదికగా శనివారం నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం చేసేలా గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ దీక్షను చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందరురోడ్డులోని డీవీ మేనర్ సెంటర్ నుంచి అందరితో కలిసి ప్రదర్శనగా బెంజిసర్కిల్కు చేరుకున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ముఖ్యమంత్రి స్వయంగా అందరితో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.
ఏపీ ప్రజల పొట్టకొడుతోంది..
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా హోదా ఇస్తామన్న కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రం ఏపీ ప్రజల పొట్టకొడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. అయినా, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సత్తా తెలుగుజాతికి ఉందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వేడుకలు సంతోషంగా ఎలా జరుపుకుంటాం
విభజన సమయంలో కొంతమంది రాజీపడ్డారని, మరికొంతమంది కోవర్టులుగా మారారని చంద్రబాబు ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా విభజన చేశారని మండిపడ్డారు. అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు.
పెద్ద జోక్.. అమరావతి గురించి మోడీకి సింగపూర్ ప్రధాని..
దేశంలో పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పెట్రోల్పై పైసా తగ్గించడం ప్రపంచంలోనే పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. మోడీ తీరుతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్ద తేడా లేకుండా వ్యాపారులను వేధిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని...అసలు స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఎందుకు అమలు చేయరని నిలదీశారు. మోడీ అస్తవ్యస్తపాలనతో 10 రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు చేస్తున్నారన్నారు. ధొలేరాపై ఉన్న ప్రేమ అమరావతిపై లేదన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు పంపలేదని అమిత్ షా పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అమరావతి గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని మోడీకి సింగపూర్ ప్రధాని చెప్పారని సీఎం తెలిపారు.
కుట్ర రాజకీయాలతో జాగ్రత్త
దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పేరుతో కేసులు పెట్టాలని చూశారని...ట్రిపుల్ తలాక్లో కేసులు వద్దని అడ్డుకున్నానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు లభ్యంకావడం లేదని అన్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా అమలుకావడం లేదని బాబు అన్నారు. మోడీ చేతల ప్రధాని కాదు.. మాటల ప్రధాని మాత్రమే అని వ్యాఖ్యానించారు. కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జగన్ పార్టీ రహస్య ఒప్పందం
ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమానికి కొందరు తూట్లు పొడిచారని.. .ఇప్పుడు ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు అంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఎంపీలను అడ్డుపెట్టుకుని పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ రాకుండా చేశారని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.
అన్ని మాయమాటలే
విశాఖ రైల్వేజోన్పై మాయమాటలు చెబుతూ తప్పించుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒడిశా ఒప్పుకున్నా రైల్వేజోన్ ఇవ్వడం లేదన్నారు. విద్యాసంస్థలకు అరకొర నిధులే కేటాయిస్తున్నారని సీఎం తెలిపారు. చట్టంలో ఉన్న పెట్రో కారిడార్ ఏర్పాటు చేయమని అడిగితే రూ.5500 కోట్లు ఇవ్వాలంటున్నారని చెప్పారు. తాము డబ్బులు ఇస్తే తమరు చేసేదేంటని సీఎం నిలదీశారు. దుగరాజపట్నం పోర్ట్, కడప ఉక్కుఫ్యాక్టరీపై అతీగతీ లేదన్నారు. విజయవాడ, విశాఖ మెట్రో లాభదాయకం కాదంటున్నారన్నారు. రాష్ట్ర అకౌంట్లో డబ్బులు వేసి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనను పట్టించుకోవడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు.