వాడుకుని వదిలేశారు: జనసేన, గీతాఆర్ట్స్ పై జూనియర్ ఆర్టిస్ట్ బాంబు: రాత్రంతా ఫిల్మ్ ఛాంబర్ లో!
Recommended Video
హైదరాబాద్: జనసేన పార్టీపై సంచలన ఆరోపణ చేశారు ఓ జూనియర్ ఆర్టిస్ట్. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే.. విస్తృతంగా అవకాశాలను ఇప్పిస్తామని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపించిన వారంతా మొహం చాటేశారని ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. కొందరు సినీ పెద్దల తీరుకు నిరసనగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ రాత్రంతా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో గొలుసులతో తనను తాను నిర్బంధించుకున్నారు.
వినాయకుడి మండపం వద్ద తాగి తందనాలు..రికార్డింగ్ డాన్సులు: ఎనిమిది మంది కటకటాల వెనక్కి
బుధవారం రాత్రంతా ఫిల్మ్ ఛాంబర్ లోనే గడిపారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు.ఆ జూనియర్ ఆర్టిస్ట్ పేరు బోయ సునీత. కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. పెద్దగా గుర్తింపు రాలేదు. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు ప్రముఖ నటుడు నాగబాబు పోటీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానంలో బోయ సునీత విస్తృతంగా ప్రచారం చేశారు. వాటితోపాటు పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన భీమవరం, గాజువాకల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను మాత్రమే కాకుండా.. తనకు పరిచయం ఉన్న వారితో కూడా ఆమె జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారని అంటున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద నిర్మించిన అన్ని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపడం వల్లే తాను జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నానని, దీనికోసం సొంతం డబ్బులను ఖర్చు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని బోయ సునీత ఆరోపిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత..జనసేన పార్టీ నాయకత్వం గానీ, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపించిన ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గానీ.. తనను పట్టించుకోలేదని విమర్శించారు. తాను పలుమార్లు వారిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బన్నీ వాసు, జనసేన పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ ఆమె ఫిల్మ్ ఛాంబర్ లో తనను తాను నిర్బంధించుకున్నారు. రాత్రంతా అక్కడే గడిపారు.
పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి తనకు సమాధానం ఇవ్వాలని, తను ఆవేదనను ఆయనకు వివరించుకుంటున్నానని అన్నారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో గురువారం తెల్లవారు జామున వారు ఫిల్మ్ నగర్ తలుపులను పగులగొట్టి.. బోయ సునీతను అదుపులోకి తీసుకున్నారు. బోయ సునీత వ్యవహారాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆమె గతంలోనూ ఇలా ప్రవర్తించారని అన్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని కొట్టి పడేస్తున్నారు. ప్రధాన ఆరోపణలను ఎదుర్కొంటున్న గీతా ఆర్ట్స్ అధినేతలు గానీ, నిర్మాత బన్నీ వాసు గానీ ఈ అంశంపై తమ స్పందన ఏమిటనేది ఇంకా తెలియజేయాల్సి ఉంది.