తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
తారకరత్నను పరామర్శించిన జూ ఎన్టీఆర్ కన్నటి పర్యంతమయ్యారు. తారక్ వెంటే కర్ణాటక మంత్రి ఆస్పత్రికి వచ్చారు.
నందమూరి తారకరత్నను జూ ఎన్టీఆర్ పరామర్శించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూడగానే ఒక్క సారిగా భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. తారకరత్నను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి జూ ఎన్టీఆర్ ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లారు.
ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్య బృందాన్ని అడిగి ఎన్టీఆర్ తెలుసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, పిల్లలకు ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు. జూనియర్ వెంట ఆయన సతీమణి ప్రణతి కూడా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.
జూ ఎన్టీఆర్ తో కర్ణాటక మంత్రి ఆస్పత్రికి
నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న సతీమణికి ధైర్యం చెప్పారు. తారకరత్నను పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్న వేళ. ఆస్పత్రికి కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిని ఆ రాష్ట్ర సీఎం పంపారు. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ మంత్రితో కలిసి జూనియర్ తో పాటుగా విమానశ్రయం నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు.
తారకరత్నను కుప్పం నుంచి బెంగుళూరుకు తరలించే సమయంలోనూ సీఎం బొమ్మ ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి చేరేలా ఆదేశాలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సంబంధాలతో కర్ణాటక ఆరోగ్య మంత్రి ఆస్పత్రికి వచ్చి వైద్యులతో చర్చించారు. ఇద్దరు వైద్య నిపుణులను రప్పిస్తున్నారు. నిన్నటి కంటే కొంత స్పందన కనిపిస్తోందని..తారకరత్న కోలుకుంటారని హీరో శివన్న..నందమూరి బాలయ్యతో కలిసి ఆకాంక్షించారు.
తారకరత్న పోరాటం చేస్తున్నారు
తారకరత్న పోరాటం చేస్తున్నారని జూ ఎన్టీఆర్ ఉద్వేగంతో చెప్పారు. నిన్నటి మీద కొంత స్పందన కనిపిస్తోంది.. నిన్నటి రోజున ఆ స్పందన కూడా లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారని వివరించారు. కానీ క్రిటికల్ కండీషన్ లోనే ఉన్నారన్నారు.
తాత ఆశీస్సులతో పాటుగా అభిమానుల ప్రార్ధనలతో తారకరత్న తిరిగి సాధారణ జీవనం సాగిస్తారని తారక్ ఆకాంక్షించారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని..ధన్యవాదాలు చెప్పారు. అన్నయ్య తారకరత్న కోలుకోవాలని అభిమానులంతా ప్రార్ధిస్తున్నారని.. వారి ప్రార్ధనలు ఫలించాలని జూ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ప్రభుత్వం నుంచి పర్యవేక్షిస్తున్నాం
తారకరత్న కోలుకొని బయటకు వస్తారని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేసారు. కుప్పంలో ప్రాధమిక చికిత్స చేసిన తరువాత బెంగుళూరుకు తరలించే సమయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్సుల్లో తారకరత్నను నారాయణ హృదయాలయకు తరలించామని చెప్పుకొచ్చారు.
పూర్తి స్థాయి అత్యుధునిక సదుపాయాలతో నిపుణులైన వైద్యుల టీం చికిత్స అందిస్తోందని చెప్పారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారని వివరించారు. కోలుకుంటారని.. ఆ నమ్మకం తమకు ఉందని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా తారకరత్న తల్లి తండ్రులు.. సతీమణి- పిల్లలకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.