జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రమేయం పట్ల యజ్ఞం జరుగుతోందా..? వైసీపి నేతల ప్రస్తావన దేనికి సంకేతం..??
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తులకు రాజకీయ ప్రధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా అధికార పక్ష వైసీపి నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడిపి మీద చేస్తున్న ఆరోపణలతో ఏపి రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవలా అభివర్ణించడమే కాకుండా ఆ పడవను ఒడ్డుకు చేర్చే సత్తా ఇప్పుడు పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి లేదని, తెలుగుదేశం పార్టీని మళ్లీ పట్టాలెక్కించి పరుగులు పెట్టించే శక్తి, సామర్థ్యం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని స్పష్టం చేస్తున్నారు వైసీపి నేతలు.
అదికార పార్టీ నేతల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. లోకేష్ మీద ప్రభావం చూపించేందుకేనా..?
ఐతే ఇది వందకు వంద శాతం అసందర్బ ప్రేలాపన అని, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం కోసం వైసిపి నేతలు ఓ యజ్ఞం చేస్తున్నారని, దీని ద్వారా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని కోలుకోని దెబ్బ తీయాలనే కుట్రకు అధికార పార్టీ నేతలు తెర తీసారని తెలుగుదేశం పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కాలం చెల్లిన నేతగా ముద్రవేయడమే కాకుండా, ఆయన కుమారుడు లోకేష్ను రాజకీయాలకు పనికి రాని నేతగా ముద్ర వేసేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అందుకోసం జూనియర్ ఎన్టీఆర్ను ఓ ఆయుధంలా వాడుకునేందకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ జపం చేస్తున్న వైసీపి నేతలు.. అంతా వ్యూహాత్మకమేనంటున్న టీడిపి శ్రేణులు..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అదే పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుండి ఉద్వాసనకు గురైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణ టీడిపిలో రగిల్చిన చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. వంశీ తర్వాత వైయస్సార్ సిపి మంత్రి కొడాలి నాని, ఆ తర్వాత తాజాగా లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్ధావించారు. వాస్తవానికి 2009సాధారణ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్కి పూర్తి స్వేచ్చనిచ్చి పార్టీ తరుపున ప్రచారానికి పంపించింది చంద్రబాబే నన్న అంశాన్ని ఇప్పుడు జూనియర్ ప్రస్ధావన తెస్తున్న నాయకులందరూ ఎందుకు మర్చిపోయారో అర్థం కాని అంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికి పార్టీని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో ఆయనే స్వయంగా రాజకీయాల నుండి తప్పుకుని సినిమాలు చేసుకుంటున్న అంశం తెలిసిందే.
ప్రజాభిప్రాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రాజకీయాల్లో ఎన్నో ఉదాహరణలు..
2009లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లొ కనిపించక పోడానికి చంద్రబాబే కారణంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, లక్ష్మీ పార్వతి అభివర్ణించడాన్ని టీడిపి శ్రేణులు తప్పుబడుతున్నాయి. కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీ తోనే ఉంటానని ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్ సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరుపున క్రియాశీల రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తానని ముందుకు వస్తే చంద్రబాబు ఆహ్వానించకుండా ఉండగలరా? పార్టీ అధికారంలోకి తేవడానికి ఎవరి విన్నింగ్ హాండ్ ఐతే ఏంటి.? అందులో బంధుత్వం ఉన్న జూనియన్ ఎన్టీఆర్ కు రాజకీయ వేదికను చూపించాల్సింది కూడా చంద్రబాబేననే చర్చ కూడా జరుగుతోంది. ఐతే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు కావలనే ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని అధికార పార్టీలోని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడిపిలో చర్చ జరుగుతంది.
తారా స్థాయిలో వ్యక్తిగత విమర్శలు.. వేడెక్కిన ఏపి రాజకీయం..
అంతే కాకుండా ఇప్పుడున్న పరిస్దితిలో టీడిపి పార్టీని బ్రతికించే సత్తా లోకేష్ కు లేదనే ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలని, తద్వారా లోకేష్ ను పూర్తిగా డమ్మి చేయాలనే వ్యూహంతో వైసీపి నేతలు ముందుకు వెళ్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఐతే ప్రజల ఆలోచనా విధానం ఎప్పుడూ ఒకేలా ఉండదని అనడానికి అనేక రాజకీయాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1982లో ఎన్టీ రామారావు పార్టీ స్ధాపించినప్పుడు కూడా మొఖానికి రంగులు వేసుకునే వాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడనే విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత ఏం జరిగిందో దేశ ప్రజలందరికీ తెలిసిందే.. ఆ తర్వాత ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్నాక అనేక విమర్శలు వచ్చాయి. ఆతర్వాత జరిగిన 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించారు.
అధికార పార్టీ వితండ వాదన.. జూనియర్ వస్తానంటే ఆపేదెవరు..?
2002 గోద్రా అల్లర్లలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని దేశం మొత్తం విలన్గా అభివర్ణించింది. తర్వాత మోదీ అదే ప్రజలతో హీరో అనిపించుకోవడం లేదా? దేశాన్ని పరిపాలించడం లేదా? కాలాన్ని బట్టి రాజకీయాలు మారుతుంటాయని, ప్రజల ఆలోచనా విధానంలో కూడా అనూహ్య మార్పులు వస్తుంటాయనేది చరిత్ర చెప్తున్న సత్యం. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కాలం చెల్లిపోయాడని గొంతు చించుకున్నా, లోకేష్ రాజకీయాలకు పనికి రాడని ఉపన్యాసాలు ఇస్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే తెలుగుదేశాన్ని కాపాడే తారక మంత్రమని పదే పదే చెప్పుకొస్తున్నా అన్నిటికి సరైన సమాధానం చెప్పేది మాత్రం కాలమే. ఐతే స్వార్ధ రాజకీయాల కోసం, కొందరి రాజకీయ భవితను మృగ్యం చేసేందుకు మరో వ్యక్తి పేరును పదే పదే ప్రస్తావిస్తూ.. రాజకీయ యజ్ఞం చేయడంలో దీర్గకాలిక ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న..!!