జగన్! ఏ పిచ్చితో టీవీ, పత్రిక పెట్టావు: జూపూడి, స్నానమెందుకు చేశావన్న అచ్చెన్న
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రి ఘటనపై కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రచార పిచ్చి ఉంటే.. జగన్కు ఏ పిచ్చి ఉండి టీవీలు, పేపర్లు పెట్టారని జూపూడి ప్రశ్నించారు.
పుష్కరఘాట్లోని ప్రమాదాన్ని రాజకీయం చేస్తూ కథలు అల్లి జగన్ ఛానెల్లో ప్రసారం చేయిస్తున్నారని జూపూడి ఆరోపించారు. ప్రమాద ఘటన పట్ల చింతిస్తున్నానని, క్షమించమని చంద్రబాబు కోరారని... ఆ విషయం కొన్ని ఛానళ్లు కళ్లుండి చూస్తే అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకుని ఆచరణాత్మక సూచనలు ఇవ్వాలని హితువు పలికారు.
పుష్కరాల గురించి ప్రభుత్వానికి జగన్ సూచనలు, సలహాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయనకు బాధ్యత లేదా? అని నిలదీశారు. పుష్కరాల నేపథ్యంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ తన కేడర్కు ఎందుకు పిలుపునివ్వలేదని ప్రశ్నించారు.
నువ్వెందుకు పుష్కర స్నానం చేశావ్: అచ్చెన్నాడు
శ్రీకాకుళం: ప్రభుత్వం ప్రజల్లో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తోందని విమర్శించిన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కొవ్వూరు వద్ద గోదావరిలో పుష్కర స్నానం ఎలా చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా తన తండ్రి వైయస్కు పిండ ప్రదానం ఎందుకు చేశారన్నారు. గురువారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘దేవుళ్ల పట్ల నమ్మకం లేనివాడివి నీవెందుకు ఆచారాలను కొనసాగిస్తున్నావు' అని ప్రశ్నించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంత పక్కాగా ఏ ఉత్సవాన్నీ చేయలేకపోవడం, ఇప్పుడు టిడిపి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు జీర్ణించుకోలేక పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పుష్కరఘాట్ వద్ద చనిపోయిన కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదని అన్నారు. అయితే బాధతో ఉన్న ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వారి కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని కలిగించేందుకు ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని వివరించారు.
పుష్కర ఘాట్ దుర్ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. వీరి కుటుంబాలకు రూ.10 లక్షలు పొప్పున రూ.90 లక్షలు ఎక్స్గ్రేషియాను మంత్రి అచ్చన్నాయుడు వారి కుటుంబసభ్యులకు అందించారు.